LS polls: ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియ.. ఎలా ఉంటుందంటే!

జూన్‌ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లను లెక్కిస్తారు.

Updated : 03 Jun 2024 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల నిర్వహణ అనేది సవాళ్లతో కూడుకున్న ప్రక్రియ. కట్టుదిట్టమైన భద్రత, అధికారుల సమన్వయంతో ఎంత పకడ్బందీగా నిర్వహిస్తారో.. కౌంటింగ్‌ ప్రక్రియకూ అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా లెక్కింపు కోసం ఈసీ నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. జూన్‌ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆ ప్రక్రియను ఓసారి పరిశీలిస్తే..

  • ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961లోని ‘రూల్‌ 54ఏ’ ప్రకారం.. పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లను తొలుత లెక్కిస్తారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ టేబుల్‌ వద్ద వీటిని మొదలు పెడతారు.
  • పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాతే ఈవీఎంలలోని ఓట్లను లెక్కింపు ప్రారంభించాల్సి ఉంటుంది.
  • ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు లేకుంటే నిర్దేశించిన సమయానికే ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలుపెట్టాలి.
  • కౌంటింగ్‌కు ఫారం 17సీతోపాటు ఈవీఎంలలోని కంట్రోల్‌ యూనిట్‌ (సీయూ) మాత్రమే అవసరం.
  • సీయూల నుంచి ఫలితాన్ని నిర్ధారించే ముందు.. పేపర్‌ సీల్‌ చెదిరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అనంతరం మొత్తం పోలైన ఓట్లను.. ఫారం 17సీలో పేర్కొన్న సంఖ్యతో సరిపోవాలి.
  • లెక్కింపు తర్వాత ఆ ఫలితాన్ని తొలుత కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, మైక్రో అబ్జర్వర్‌, కౌంటింగ్‌ ఏజెంట్లకు చూపించాలి.
  • ప్రతి కంట్రోల్‌ యూనిట్‌లో అభ్యర్థి వారీగా వచ్చిన ఫలితాన్ని ఫారం 17సీలోని పార్టు-2లో నమోదు చేయాలి.
  • కంట్రోల్‌ యూనిట్‌లోని డిస్‌ప్లే ప్యానెల్‌పై ఒకవేళ ఫలితం కనిపించకుంటే.. అన్ని సీయూల లెక్కింపు పూర్తైన తర్వాత, ఆయా వీవీ ప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలి.
  • ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు చెందిన ఫారం 17సీని.. తుది ఫలితాన్ని కంపైల్‌ చేస్తున్న అధికారికి పంపించాలి. ఆయన వాటిని ఫారం 20లో పొందుపరుస్తారు.
  • కంట్రోల్‌ యూనిట్‌లలో ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాతే వీవీప్యాట్‌ స్లిప్పుల కౌంటింగ్‌ మొదలుపెట్టాలి.
  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం/లోక్‌సభ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఐదు పోలింగ్‌ స్టేషన్లను ర్యాండమ్‌గా ఎంపిక చేసుకొని.. వాటిలోని ఒక్కో వీవీప్యాట్‌లోని స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుంది.
  • తిరస్కరణకు గురైన పోస్టల్‌ బ్యాలెట్‌ల సంఖ్య కంటే గెలుపు మార్జిన్‌ తక్కువగా ఉన్నట్లయితే.. అటువంటి సమయంలో రిజెక్టయిన పోస్టల్‌ బ్యాలెట్‌లను మరోసారి తప్పనిసరిగా పున పరిశీలించాలి. ఆ తర్వాతే తుది ఫలితం వెల్లడించాలి.
  • ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చినట్లయితే.. డ్రా తీసి ఫలితం ప్రకటిస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు