Supreme Court: సుప్రీం కోర్టు భవనాన్ని కూల్చొద్దు!.. సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌

సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చివేసే బదులు వేరే చోట కొత్త భవనాన్ని నిర్మించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది.

Published : 28 May 2024 20:52 IST

దిల్లీ: సుప్రీం కోర్టు భవనాన్ని కూల్చవద్దని కేంద్ర ప్రభుత్వంతోపాటు కోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలివ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court)లో పిటిషన్‌ దాఖలైంది. భారీ కట్టడాన్ని కూల్చివేసే బదులు వేరే చోట కొత్త భవనాన్ని నిర్మించాలని పిటిషనర్‌ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని ఇతర అవసరాలకు వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

‘‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో నిర్మించిన ముఖ్యమైన కట్టడాల్లో సుప్రీం కోర్టు ఒకటి. దీన్ని కూల్చివేస్తే చరిత్రలో ఒక భాగాన్ని నాశనం చేసినట్లే అవుతుంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ప్రైవేటు ప్రాంతాల్లో కొనసాగుతోన్న అనేక కోర్టులు, ట్రైబ్యునళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇక్కడ వసతి కల్పించవచ్చు’ అని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు కొత్త భవనానికి సంబంధించిన నమూనాను కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదని, ప్రజలతో పాటు బార్‌ అసోసియేషన్‌లతోనూ దీనిపై చర్చించలేదన్నారు.

‘‘ప్రస్తుతం 17 కోర్టు రూమ్‌లు, రెండు రిజస్ట్రీ రూమ్‌లు ఉన్నాయి. ఈ మొత్తం భవనాన్ని కూల్చివేసి రూ.800 కోట్లతో కొత్త భవనం నిర్మించాలని యోచిస్తున్నారు. ఇందులో 27 కోర్టు రూమ్‌లు, నాలుగు రిజిస్ట్రీ రూమ్‌లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. సుప్రీం కోర్టులో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున పదేళ్ల తర్వాత ఇవి కూడా సరిపోవు’’ అని కేకే రమేష్‌ అనే వ్యక్తి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని