Modi: ‘అసలు అదేం భాష’: రాహుల్‌ గాంధీపై మోదీ ఆగ్రహం

కాంగ్రెస్ యువరాజు మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యయుతంగా లేవంటూ ప్రధాని మోదీ (Modi) విమర్శలు చేశారు. 

Published : 02 Apr 2024 15:13 IST

రుద్రపుర్‌: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ప్రధాని నరేంద్రమోదీ (Modi) ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశం అట్టుడుకుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రధాని ఖండించారు. అసలు అదేం భాష అని విమర్శించారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రుద్రపుర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

‘‘మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే.. దేశం అట్టుడికిపోతుందని కాంగ్రెస్ యువరాజు వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన ఆ పార్టీ పదేళ్ల కిందట అధికారాన్ని కోల్పోయింది. వారు ఇప్పుడు ఇలాంటి మాటలు అంటున్నారు. వాటిని మీరు అంగీకరిస్తారా..? అలాంటి భాష ఆమోదయోగ్యమా..? అవి ప్రజాస్వామ్యయుతమైన మాటలేనా..?’’ అని మోదీ తీవ్రంగా స్పందించారు.

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో.. ఆదివారం దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ప్రతిపక్ష ‘ఇండియా బ్లాక్‌’ లోక్‌తంత్ర బచావో ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. ‘‘ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అంపైర్లపై ఒత్తిడి చేసి.. ఆటగాళ్లను కొనుగోలు చేసి.. కెప్టెన్లను బెదిరించి మ్యాచ్‌లు గెలవవచ్చు. దీనిని క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటారు. మన ఎదుట లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. అంపైర్లను ప్రధాని మోదీ ఎన్నుకొన్నారు. మ్యాచ్‌కు ముందే మా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లను అరెస్టు చేశారు. ఈవీఎంలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, సోషల్‌ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా వారు 180కి మించి స్థానాలు గెలవడం అసాధ్యం. ఈ ఫిక్సింగ్ ఎన్నికల్లో భాజపా గెలిచి, రాజ్యాంగాన్ని మారిస్తే.. ఈ దేశం మొత్తం అట్టుడుకుతుంది. గుర్తుంచుకోండి’’ అని భాజపాపై రాహుల్ విమర్శలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు