Modi: సీఎంని రావొద్దని నేనే చెప్పా: కాంగ్రెస్‌ విమర్శలపై మోదీ స్పష్టత

తనను ఆహ్వానించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని ఎయిర్‌పోర్టుకు రావొద్దనడానికి ప్రధాని మోదీ(Modi) కారణం చెప్పారు. అసలు ఏమైందంటే..?

Updated : 26 Aug 2023 12:54 IST

బెంగళూరు: శనివారం ఉదయం బెంగళూరుకు వచ్చిన ప్రధాని మోదీ(Modi)కి స్వాగతం పలికేందుకు.. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరిలో ఎవరూ హాజరుకాలేదు. మోదీ ఉద్దేశపూర్వకంగానే వారిని ఎయిర్‌పోర్టుకు రావొద్దన్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అందుకు ప్రధాని నరేంద్రమోదీనే స్వయంగా స్పష్టత ఇచ్చారు.

‘తనకంటే ముందు కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలను అభినందించడంపై మోదీ చాలా చికాకుగా ఉన్నారు. అందుకే ప్రొటోకాల్‌కు విరుద్ధంగా.. వారిద్దరిని ఉద్దేశపూర్వకంగా ఎయిర్‌పోర్టుకు రాకుండా ఆపేశారు. ఇలాంటి రాజకీయాలు హాస్యాస్పదం. చంద్రయాన్‌-1 విజయం వేళ.. 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ముందు సీఎంగా ఉన్న మోదీ.. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు వెళ్లారు. ఆ విషయాన్ని మోదీ మర్చిపోయారా..?’ అని కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌ విమర్శించారు.

చంద్రయాన్‌ - 3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు: ప్రధాని మోదీ

దీనిపై మోదీ నుంచి స్పష్టత వచ్చింది. బెంగళూరులోని హాల్‌ ఎయిర్‌పోర్టు వెలుపల ప్రధాని మాట్లాడుతూ.. వారిని రావొద్దనడానికి కారణం చెప్పారు. ‘బెంగళూరు(Bengaluru)కు నేను ఏ సమయంలో చేరుకుంటానో కచ్చితంగా తెలీదు. అందుకే ప్రొటోకాల్ విషయంలో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. అందుకే వారిని రావొద్దని చెప్పాను’ అని మోదీ వెల్లడించారు.

శుక్రవారం గ్రీస్‌ దేశంలో పర్యటించిన ప్రధాని మోదీ(Modi).. ఈ ఉదయం నేరుగా బెంగళూరు వచ్చి, శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వారి కృషికి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌-3 ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వివరించారు.

మోదీ మాటలతో ఏకీభవిస్తున్నా: డీకే

ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ‘ప్రధాని చెప్పినదాంతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం, నేను ప్రధానిని ఆహ్వానించేందుకు వెళ్దామని అనుకున్నాం. కానీ ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన సమాచారాన్ని మేం గౌరవించాలనుకున్నాం. పొలిటికల్ గేమ్‌ ఇప్పటికే ముగిసింది. ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించాం’ అని శివకుమార్ అన్నారు. ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గద్దె దింపి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దానిని ఉద్దేశించే పొలిటికల్ గేమ్ అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు