Modi: ‘నా ఎనర్జీ రహస్యమదే’: పీఎంఓ సిబ్బందితో మోదీ

మూడోసారి కేంద్రంలో మోదీ సర్కార్ ఆదివారం కొలువుదీరిన సంగతి తెలిసిందే. నేడు ఆయన పీఎంఓలో బాధ్యతలు స్వీకరించి తొలి దస్త్రంపై సంతకం కూడా చేశారు. ఈ క్రమంలోనే సిబ్బందితో మాట్లాడారు. 

Published : 10 Jun 2024 18:39 IST

దిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్రమోదీ(Modi).. పీఎంఓ సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వం అంటే మోదీ ఒక్కరే కాదని, ఎంతోమంది ఆలోచనల సమాహారమని అన్నారు. పదేళ్ల క్రితం పీఎంఓ అంటే ఒక అధికార కేంద్రం అనే భావన ఉండేదన్నారు. అలాగే తాను నిత్యం ఉత్సాహంగా ఉండటానికి గల రహస్యాన్ని వెల్లడించారు. 

‘‘పీఎంఓ ఒక అధికార కేంద్రంలా ఉండాలన్నది నా విధానం కాదు. నేను అధికారం కోసం జన్మించలేదు. 2014కు ముందున్న భిన్నమైన పరిస్థితులను మార్చే దిశగా నిర్ణయాలు తీసుకున్నాం. పీఎంఓ ఎప్పుడూ ప్రజల కోసం పని చేయాలి. అది మోదీ పీఎంఓగా ఉండకూడదు. మనందరి లక్ష్యం.. దేశమే ప్రథమం, మనందరి మోటివేషన్.. 2047 నాటికి వికసిత్ భారత్‌ సాధించుకోవడం. 2047 కోసం నిర్విరామంగా పని చేస్తానని దేశ ప్రజలకు హామీ ఇచ్చాను.   నా బృందం నుంచి నాకు అలాంటి అంచనాలే ఉన్నాయి. మనం సమయం చూసుకొని, కాలానికి కట్టుబడి పనిచేసే వ్యక్తులం కాదు. మన ఆలోచనలకు పరిమితి లేదు. ఇలాంటి పరిమితులు లేకుండా పని చేసేవారే నా జట్టు సభ్యులు. వారినే ఈ దేశం విశ్వసిస్తుంది.

ఈ పది సంవత్సరాల్లో నేను ఆలోచించిన దానికంటే ఎక్కువ ఆలోచించడం. నేను చేసిన దానికంటే ఇంకా ఎక్కువ చేయడం నా బాధ్యత అని నేను అనుకుంటున్నాను. జీవితంలో మనం నేరవేర్చుకోవాలనుకున్న కోరిక స్థిరంగా ఉన్నప్పుడు.. కాలక్రమంలో దానికి స్థిరత్వం వస్తుంది. అప్పుడు దానిని నెరవేర్చుకునే క్రమంలో అది ఒక తీర్మానంగా మారుతుంది. ఆ తీర్మానానికి కఠోర శ్రమ కలిస్తే.. విజయంగా మారుతుంది. ప్రతిఒక్కరూ నా ఎనర్జీకి కారణమేంటని అడుగుతుంటారు. ప్రతి వ్యక్తి తన లోపలి విద్యార్థిని సజీవంగా ఉంచితే.. ఎప్పటికీ శక్తిహీనుడు కాడు’’ అంటూ తనలోని ఉత్సాహానికి గల కారణం చెప్పారు. తన ప్రసంగం ద్వారా సిబ్బందిలో ప్రేరణ నింపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు