PM Modi: 10 రోజులు.. 12 రాష్ట్రాలు.. మోదీ సుడిగాలి పర్యటన ఇలా!

లోక్‌సభ ఎన్నికల నగరా మోగడానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రంగం సిద్ధమైంది.

Updated : 03 Mar 2024 16:28 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) షెడ్యూల్‌ రావడానికి ముందే పలు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సుడిగాలి పర్యటనలకు షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చే పది రోజుల్లో తెలంగాణతో పాటు మొత్తం 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 29 అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఏప్రిల్-మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో అభివృద్ధి, సంక్షేమ అజెండాపై దృష్టిసారించిన ప్రధాని.. దేశంలోని పలు రాష్ట్రాల్లో రూ.లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, జమ్మూకశ్మీర్‌, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, దిల్లీల్లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

మార్చి 4న (సోమవారం) తెలంగాణలోని ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని.. ఆ తర్వాత తమిళనాడులోని కల్పకమ్‌లో భారతీయ నభికియా విద్యుత్‌ నిగం లిమిటెడ్‌ను సందర్శించనున్నారు. ఆదిలాబాద్‌, చెన్నైలలో బహిరంగ సభల్లో మాట్లాడతారని అధికారులు తెలిపారు. మళ్లీ మార్చి 5న ప్రధాని మోదీ తెలంగాణలోని సంగారెడ్డిలో పలు ప్రాజెక్టులను ప్రారంభించి సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఒడిశాకు వెళ్తారు.  అక్కడ చండీఖోలేలో బహిరంగ సభలో ప్రసంగించి మార్చి 6న కోల్‌కతాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బరాసత్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బిహార్‌కు వెళ్లి బెట్టియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని అధికారులు తెలిపారు.  మార్చి 7న జమ్మూకశ్మీర్‌లో పర్యటించి సాయంత్రం తిరిగి దిల్లీకి చేరుకొని ఓ మీడియా ఈవెంట్‌లో పాల్గొననున్నారు.

మార్చి 8న దిల్లీలో తొలిసారి జరిగే  నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని అదే రోజు సాయంత్రం అస్సాం వెళ్తారు. అస్సాంలోని జోర్హాట్‌లో లెజెండరీ అహోం ఆర్మీ కమాండర్ లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత, జోర్హాట్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.  అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించిన తర్వాత ఇటానగర్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. 

మార్చి 10న ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..  అజంగఢ్‌లో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారని అధికారులు తెలిపారు. ఆ మరుసటి రోజు దిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హరియాణా సెక్షన్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కార్యక్రమంలో పాల్గొంటారు. మార్చి 12న గుజరాత్‌లోని సబర్మతి, రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. మార్చి 13న గుజరాత్‌, అస్సాంలో మూడు ముఖ్యమైన సెమీకండక్టర్ల ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని