Modi-Bill Gates: ప్రధాని మోదీ, బిల్‌గేట్స్‌.. ‘చాయ్‌ పే చర్చ’

Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ‘చాయ్‌ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్‌ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు.

Updated : 29 Mar 2024 10:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. అయితే, కృత్రిమ మేధతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ (Bill Gates) శుక్రవారం ‘చాయ్‌ పే చర్చ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్‌ టెక్నాలజీ సహా పలు రంగాలపై వీరిద్దరూ చర్చించారు.

డీప్‌ఫేక్‌తో నా గొంతునూ అనుకరించారు..

‘‘సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి నేను ఇష్టపడతా. ఇందులో నేను నిపుణుడిని కాదు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఉత్సుకతతో ఉంటా. మా అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించుకున్నాం. కృత్రిమ మేధతో హిందీలో చేసిన నా ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించాం. ఏఐ శక్తిమంతమైనదే. కానీ.. దాన్ని మ్యాజిక్‌ టూల్‌గా ఉపయోగిస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. సరైన శిక్షణ లేకుండా దీన్ని అందిస్తే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో పయనిస్తుంది. భారత్‌ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్‌ఫేక్‌ను ఎవరైనా వినియోగించొచ్చు. డీప్‌ఫేక్‌తో నా గొంతును కూడా అనుకరించారు’’ అని మోదీ తెలిపారు.

దీనికి బిల్‌గేట్స్ బదులిస్తూ.. ‘‘కృత్రిమ మేధ వినియోగంలో మనం ప్రారంభ దశలో ఉన్నాం. మనం కష్టం అనుకున్నవి సులువుగా చేస్తుంది. తేలికని భావించే వాటిలో విఫలమవుతోంది. ఏఐ అనేది పెద్ద అవకాశం. దాంతో కొన్ని సవాళ్లూ ఉన్నాయి’’ అని అన్నారు. అప్పుడు మోదీ స్పందిస్తూ.. ‘‘డీప్‌ఫేక్‌ కంటెంట్‌ ఏఐతో సృష్టించారని గుర్తించడం చాలా అవసరం. అందుకోసం కంటెంట్‌కు వాటర్‌మార్క్‌లు ఉంటే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఎవరూ దీన్ని తప్పుదోవ పట్టించలేరని పేర్కొన్నారు.

‘నమో యాప్‌’లో బిల్‌గేట్స్‌ సెల్ఫీ..

ఈ సందర్భంగా నమో యాప్‌లో ఏఐ వినియోగంపై గేట్స్‌కు ప్రధాని అవగాహన కల్పించారు. ఈ యాప్‌లో సెల్ఫీ తీసుకుంటే అందులో ఉన్న ముఖాన్ని గుర్తించి ఆ వ్యక్తి పాత ఫొటోలను రిట్రీవ్‌ చేస్తుందని చెప్పారు. తన ఫోన్‌ను గేట్స్‌కు ఇచ్చి నమో యాప్‌లో సెల్ఫీ దిగమని చెప్పారు. ఆ తర్వాత గతంలో వీరిద్దరూ దిగిన పలు ఫొటోలు రావడాన్ని ప్రధాని చూపించారు.

‘‘డిజిటల్‌ రంగంలో భారత్‌ చాలా మార్పులు తీసుకొచ్చింది. నమో డ్రోన్‌ దీదీ పథకం విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు సైకిల్‌ నడపడం కూడా రాని మహిళలు.. ఇప్పుడు పైలట్లుగా, డ్రోన్లు ఆపరేట్‌ చేసే స్థాయికి ఎదిగారు. చిరు ధాన్యాల వల్ల అధిక ప్రయోజనం కలుగుతుంది. తక్కువ నీటితో ఎరువులు లేకుండా వీటిని సాగు చేయొచ్చు. దీంతో చిన్న రైతుల జీవితాల్లో మార్పులు వచ్చాయి. డిజిటల్‌ సాంకేతికతతో సామాన్యులకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం లభిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వానికి, పేదలకు మధ్య అంతరం ఉండేది. ఇప్పుడు డిజిటల్‌ టెక్నాలజీతో నేరుగా ప్రభుత్వం నుంచే పేదవాడికి అన్నీ అందుతున్నాయి’’ అని బిల్‌గేట్స్‌కు మోదీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని