Republic Day: గణతంత్ర దినోత్సవం వేళ ఉగ్ర ముప్పు.. ఎస్‌ఎఫ్‌జేపై కేసు

గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో ఉగ్రదాడులకు పాల్పడతామంటూ సిక్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థకు చెందిన గురపత్వంత్‌ సింగ్‌ ఓ వీడియో విడుదల చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు ఎస్‌ఎఫ్‌జేతోపాటు అతడిపై కేసు నమోదు చేశారు.

Updated : 23 Jan 2024 16:41 IST

దిల్లీ: జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) నిర్వహించుకునేందుకు యావత్‌ దేశం సిద్ధమవుతుండగా...సిక్‌ ఫర్‌ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) ఉగ్రవాద సంస్థకు చెందిన గురుపత్వంత్‌ సింగ్‌ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశమైంది. రిపబ్లిక్‌ డే రోజున ప్రత్యేక పంజాబ్‌ (Punjab) అనుకూల సంస్థ ఎస్‌ఎఫ్‌జే (SFJ) ఉగ్రదాడులకు పాల్పడుతుందన్నది ఆ వీడియో సారాంశం. ‘‘జనవరి 26న ఇళ్లల్లోనే ఉండండి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దిల్లీనే మా లక్ష్యం. అదే రోజున ఖలిస్థాన్‌ జెండాను ఆవిష్కరిస్తాం’’ అని గురపత్వంత్‌ సింగ్‌ వీడియోలో చెప్పాడు. ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగుర వేసిన వారికి 5 లక్షల డాలర్ల నజరానా ఇస్తామని ప్రకటించాడు. 2023లో భారత్‌ నుంచి పంజాబ్‌ను వేరు చేస్తామని తెలిపాడు.

ఈ నేపథ్యంలో వినీత్‌ జిందాల్‌ అనే న్యాయవాది ఎస్‌ఎఫ్‌జే సంస్థతోపాటు గురుపత్వంత్‌ సింగ్‌పై సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు. వీడియో చూసిన తర్వాత షాక్‌కు గురయ్యానని స్థానికంగా ఉంటూనే దేశ  వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం దారుణమని ఆయన అన్నారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌జే, గురుపత్వంత్‌ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గురుపత్వంత్‌ను భారతప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాకుండా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న కారణంతో ఎస్‌ఎఫ్‌జే పైనా నిషేధం విధించింది. రెండు వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొట్టేందుకు యత్నించాడన్న కారణంతో గురుపత్వంత్‌పై పోలీసులు గత ఏడాది కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని దిల్లీ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సిటీ పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాని స్థానికులను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని