Indian Railways: రైళ్లలో తగ్గిన వయోవృద్ధుల ప్రయాణాలు

కరోనా మహమ్మారి తర్వాత రైళ్లలో వయోవృద్ధుల మరణాలు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 24శాతం తగ్గిందని వెల్లడైంది. కొవిడ్‌తోపాటు వృద్ధులకు టికెట్‌పై ఇచ్చే రాయితీని నిలిపివేయడం ఇందుకు కారణంగా అధికారులు అంచనా వేస్తున్నారు.

Published : 28 Nov 2022 01:45 IST

దిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే సేవలందిస్తోంది. కోట్ల మంది పౌరులు సుదూర ప్రయాణాల కోసం రైళ్లను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇటీవల రైళ్లలో ప్రయాణించే వయోవృద్ధుల సంఖ్య తగ్గినట్లు వెల్లడైంది. 2019-2020తో పోలిస్తే 2021-2022లో వయోవృద్ధుల ప్రయాణికుల సంఖ్య సుమారు 24శాతం తగ్గినట్లు సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. కొవిడ్‌ రెండో వేవ్‌ ఉద్ధృతి కొనసాగడం వల్ల రైలు ప్రయాణాలకు దూరంగా ఉండటం ఇందుకు కారణమై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు వయోవృద్ధులకు ఇచ్చే రాయితీ ఎత్తివేయడం కూడా మరో కారణంగా చెబుతున్నారు.

2018-19లో మొత్తం 7.1కోట్ల మంది వయో వృద్ధులు రైళ్లలో ప్రయాణించగా.. 2019-20 నాటికి ఈ సంఖ్య 7.2కోట్లకు పెరిగింది. అయితే, కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత 2020-21లో కేవలం 1.9కోట్ల మంది మాత్రమే ప్రయాణించారు. అదే 2021-22 వచ్చేసరికి ఈ సంఖ్య 5.5కోట్లకు పెరిగింది.

ఇక ఆదాయ పరంగా చూస్తే.. వయోవృద్ధుల విభాగం నుంచి 2018-19లో రూ.2920 కోట్లు రాగా 2019-20లో రూ.3010కోట్లకు చేరింది. 2020-21లో రూ.875కోట్లు, 2021-2022లోరూ.2598 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాదిలో సెప్టెంబర్‌ వరకు 3.8కోట్ల మంది వృద్ధులు రైళ్లలో ప్రయాణించగా.. వారి నుంచి రూ.2335 కోట్ల ఆదాయాన్ని భారతీయ రైల్వే పొందింది. కరోనా మహమ్మారి సమయంలో విధించిన ఆంక్షలు రెండో వేవ్‌ చివరి వరకు కొనసాగడం రైల్వేపై ప్రభావాన్ని చూపింది.

రైలు ప్రయాణాల్లో 58ఏళ్లు నిండిన మహిళలకు 50శాతం, 60ఏళ్లు నిండిన పురుషులకు 40శాతం రాయితీని భారతీయ రైల్వే అందిస్తోంది. అయితే, కరోనా కారణంగా మార్చి 2020 నుంచి వాటిని నిలిపివేసింది. ఇప్పటివరకు వాటిని తిరిగి పునరుద్ధరించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని