Remal Cyclone: బెంగాల్‌లో రెమాల్‌ బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్‌’ తుపాను పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టించింది. ఆదివారం రాత్రి తుపాను తీరం దాటే సమయంలో బెంగాల్‌ వణికిపోయింది.

Updated : 28 May 2024 05:23 IST

ఆరుగురి దుర్మరణం
బంగ్లాదేశ్‌లో 10 మంది మృతి

కోల్‌కతా, ఢాకా : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్‌’ తుపాను పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టించింది. ఆదివారం రాత్రి తుపాను తీరం దాటే సమయంలో బెంగాల్‌ వణికిపోయింది. ఆరుగురు వ్యక్తులు మరణించారు. 135 కి.మీ వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. కోల్‌కతాలో అనేక చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాల ధాటికి సెంట్రల్‌ కోల్‌కతాలోని ఎంటాలికి చెందిన బిబిర్‌ బగాన్‌ ప్రాంతంలో గోడ కూలి ఓ వ్యక్తి గాయాలపాలై దుర్మరణం పాలయ్యాడు. మరో ఘటనలో సుందర్‌బన్‌ డెల్టాకు ఆనుకుని ఉన్న నమ్‌ఖానా సమీపంలోని మౌసుని ద్వీపంలో ఓ పూరిల్లుపై చెట్టు కూలిన ఘటనలో వృద్ధ మహిళ ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆపై చికిత్స పొందుతూ మరణించారు. వివిధ జిల్లాల్లో మరో నలుగురు మృతి చెందారు. 

కోల్‌కతాలో ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 5.30 వరకూ 

14.6 సెం.మీ. వర్షం కురిసింది. రెమాల్‌ ప్రభావంతో కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు నీట చిక్కుకున్నాయి. సోమవారం ఉదయం 5 గంటల నుంచి రెమాల్‌ బలహీనపడి పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కోల్‌కతా సహా దక్షిణ బెంగాల్, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, హావ్‌డా, హుగ్లీ జిల్లాల్లో రాష్ట్ర, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నేల కూలిన వృక్షాలను తొలగించి ప్రధాన రహదారుల్లో రాకపోకలను పునరుద్ధరించాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. నిలిపివేసిన విమాన సర్వీసులు..సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. పట్టాలపై నీరు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో రైలు, మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రెమాల్‌ నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో కృషి చేసిన అధికార బృందాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. రెమాల్‌ తుపాను కారణంగా బెంగాల్‌ సరిహద్దు రాష్ట్రమైన అస్సాంలో గువాహటీ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. 

బంగ్లాదేశ్‌లో 1.5 కోట్లమందికి  విద్యుత్‌ కోత

బంగ్లాదేశ్‌ తీరప్రాంతంపై రెమాల్‌ తుపాను విరుచుకుపడింది. గంటకు 120 కి.మీ. వేగంతో వీచిన గాలులు, కుంభవృష్టితో బరిసాల్, భోలా, పతువాఖాలీ, సఖ్తీరా, ఛట్టోగ్రామ్‌ల్లో వందలాది గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. తుపాను కారణంగా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. వందలకొద్దీ విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో కోటీ యాభై లక్షల మందికి గంటల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని