SBI: ‘వెంటనే ఆ ఫొటో డిలీట్‌ చేయండి’: నెటిజన్‌పై ఎస్‌బీఐ ఆగ్రహం

 బ్రాంచ్‌ ఫొటో తీసి, ఒక వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఎస్‌బీఐ(SBI) ఆగ్రహం వ్యక్తం చేసింది.  

Updated : 01 Jun 2024 16:22 IST

ఇంటర్నెట్‌డెస్క్: సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోను వెంటనే డిలీట్ చేయాలంటూ ఒక వినియోగదారుడిని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ (SBI) హెచ్చరించింది. దానిని ఎవరైనా దుర్వినియోగం చేస్తే..అతడే బాధ్యత వహించాల్సి వస్తుందని వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల దగ్గర్లోని ఎస్‌బీఐ (SBI) బ్రాంచ్‌కు వెళ్లాడు. తాను వెళ్లిన సమయంలో సిబ్బంది ఎవరు విధుల్లో లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. దాంతో వెంటనే ఖాళీ క్యాబిన్లతో ఉన్న ఆ ప్రాంగణాన్ని ఫోటో తీశాడు. లలిత్‌ సోలంకి పేరిట ఉన్న ఎక్స్ ఖాతాలో షేర్ చేసి,  ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ‘‘అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలవుతోంది. సిబ్బంది లంచ్‌కు వెళ్లారు. విచిత్రమేమిటంటే.. మాకు లంచ్‌ బ్రేక్ లేదని ఎస్‌బీఐ చెప్తుంటే, సిబ్బంది కలిసికట్టుగా భోజనం చేయడానికి వెళ్లారు. ఈ ప్రపంచం పూర్తిగా మారిపోవచ్చు కానీ.. మీ సేవలు మాత్రం మారవు’’ అని పోస్టు పెట్టాడు.

సదరు వినియోగదారుడికి కలిగిన అసౌకర్యంపై చింతించిన బ్యాంక్‌.. ఫొటో షేర్ చేయడంపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. భద్రతాకారణాల దృష్ట్యా బ్రాంచ్‌ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధమని గమనించండి. అది దుర్వినియోగం అయితే బాధ్యత మీదే. సోషల్ మీడియా ఖాతాల నుంచి దానిని తొలగించాలి’’ అని హెచ్చరించింది. కానీ అప్పటికే ఆ ఫోటో వైరల్ కావడం, పలువురు కామెంట్లు పెట్టడం జరిగిపోయింది. అసలు బ్యాంక్‌ బ్రాంచుల్లో మధ్యాహ్న భోజన సమయం ఏంటని ఈ సందర్భంగా ఓ నెటిజన్ ప్రశ్నించారు. తమ బ్రాంచుల్లో సిబ్బంది లంచ్‌ కోసం నిర్దిష్ట సమయం అంటూ ఏదీ లేదని ఎస్‌బీఐ (State Bank of India) బదులిచ్చింది. వినియోగదారులకు నిరంతరంగా సేవలు అందించేక్రమంలో ఆ సమయాలు మారుతుంటాయని తెలిపింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని