Gyanvapi mosque: శివలింగానికి కార్బన్‌ డేటింగ్‌.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

జ్ఞానవాపి మసీదులో (Gyanvapi mosque) లభ్యమైన శివ లింగానికి కార్బన్‌ డేటింగ్ (Corbon Dating) నిర్వహించేందుకు అనుమతిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సుప్రీం కోర్టు విభేదించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.

Published : 19 May 2023 18:20 IST

ప్రయాగ్‌రాజ్‌: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులోని వాజుఖానాలో బయటపడిన శివలింగం (shivling)వయస్సును నిర్ధారించేందుకు కార్బన్‌ డేటింగ్‌ (Corbon Dating) పరీక్షలకు అలహాబాద్‌ హైకోర్టు (Alahabad HighCourt) ఇటీవల అనుమతిచ్చింది. తాజాగా ఉన్నత న్యాయస్థానం తీర్పుతో సుప్రీంకోర్టు విభేదించింది. ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ కార్బన్‌ డేటింగ్‌ నిర్వహించొద్దంటూ హైకోర్టు తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది.

శివలింగానికి కార్బన్‌ డేటింగ్‌కు అనుమతిస్తూ మే 12న అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. మసీదు నిర్వాహకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. మసీదు నిర్వాహకుల పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని కేంద్రం, యూపీ ప్రభుత్వాలను ఆదేశించింది. వీలైనంత త్వరగా శాస్త్రీయ సర్వేను నిర్వహించాలని కోరగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అంగీకరించాయి. శివలింగం వయస్సును నిర్ధారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే భారత పురావస్తు సర్వే(ఏఎస్ఐ) అధికారులతో సంప్రదించి యూపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా సుప్రీం కోర్టుకు వివరించారు.

జ్ఞానవాపి మసీదులో లభ్యమైన శివలింగం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్‌ డేటింగ్‌ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌ను గతేడాది అక్టోబరు 14న వారణాసి జిల్లా కోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ.. కొందరు హిందుత్వ వాదులు హైకోర్టును ఆశ్రయించగా.. ఇటీవల వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ మసీదు నిర్వాహకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే, జ్ఞానవాపి కేసు విచారణలో భాగంగా సర్వే చేపట్టాలని వారణాసి న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం గతంలోనే సర్వే పూర్తి చేసింది. ఆ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించి.. నివేదికను కోర్టుకు అందజేసింది. అనంతరం సర్వే నివేదికలోని అంశాలు బహిర్గతం కావడం వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని