SC: ప్రభుత్వ ఉద్యోగాలకు ఇద్దరు పిల్లల నిబంధన.. సమర్థించిన సుప్రీం

2-child norm: ప్రభుత్వ నియామకాల్లో ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను అమలుచేస్తున్న రాజస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

Published : 29 Feb 2024 17:15 IST

దిల్లీ: రాజస్థాన్‌ (Rajasthan)లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో ఈ నిబంధన (2-child norm) అమల్లో ఉండగా.. తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) దీన్ని సమర్థించింది. ఇందులో ఎలాంటి వివక్ష గానీ, రాజ్యాంగ ఉల్లంఘన గానీ లేదని తెలిపింది. ఈమేరకు దీన్ని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

రాజస్థాన్‌కు చెందిన రామ్‌జీ లాల్‌ జాట్‌ గతంలో సైన్యంలో పనిచేసి 2017లో పదవీ విరమణ పొందారు. అనంతరం కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రామ్‌జీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండటంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు రూ.78వేల వరకు సబ్సిడీ.. ‘సూర్యఘర్‌’కు కేబినెట్‌ ఓకే

ఆయన పిటిషన్‌ను 2022లో రాజస్థాన్‌ హైకోర్టు కొట్టివేసింది. ఇది విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను సమర్థించింది. ‘‘ఇందులో ఎలాంటి వివక్ష లేదు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ నిబంధన రాజ్యంగ ఉల్లంఘన కిందకు రాదు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల కోసం ఈ రూల్‌ తీసుకురాగా మేం దాన్ని ఆమోదించాం’’ అని వెల్లడించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

రాజస్థాన్‌ పోలీస్‌ సబ్‌ఆర్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌, 1989 ప్రకారం.. జూన్‌ 1, 2002 తర్వాత ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగిన అభ్యర్థులు నియామకాలకు అనర్హులు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఈ ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను అమలుచేస్తూ రాజస్థాన్‌ వేరియస్‌ సర్వీస్‌ రూల్స్‌ చట్టానికి 2001లో సవరణలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని