Eknath Shinde: ఏక్‌నాథ్‌ శిందేపై కమెడియన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. శివసేన కార్యకర్తల ఆగ్రహం

Eenadu icon
By National News Team Updated : 24 Mar 2025 09:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ముంబయి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందేపై స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న కమ్రా.. శిందే (Eknath Shinde)ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనను ద్రోహిగా పేర్కొన్నారు. దీంతో ఆయన (Kunal Kamra)పై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే..

ఖార్‌ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్‌ హోటల్‌లోని హాబిటాట్‌ కామెడీ క్లబ్‌లో కునాల్‌ కమ్రా (Kunal Kamra) షో జరిగింది. ఇందులో కుమ్రా.. డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ ఓ జోక్‌ వేశారు. ‘‘శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉంది’’ అంటూ మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన కమెడియన్‌.. ఏక్‌నాథ్‌ శిందేను ద్రోహిగా అభివర్ణించారు. ఈసందర్భంగా ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు.

ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేస్తూ ‘కునాల్‌ కా కమల్‌’ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఇదికాస్తా తీవ్ర వివాదాస్పదంగా మారింది. కమెడియన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన శివసేన కార్యకర్తలు.. ఆదివారం రాత్రి షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కొంతమంది శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్‌ను మూసివేస్తున్నట్లు హాబిటాట్‌ స్టూడియో ప్రకటించింది.

కునాల్‌ కమ్రాపై కేసు..

కమెడియన్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. హోటల్‌పై దాడిని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే ఖండించారు. కమెడియన్‌ పాడిన పాట 100శాతం వాస్తవమేనన్నారు. అయితే, దాడి ఘటన మాత్రం కుట్ర పూరితమైనదని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవా అని ప్రశ్నించారు.

Tags :
Published : 24 Mar 2025 08:07 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు