Prajwal Revanna: లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్‌ రేవణ్ణపై లుక్‌అవుట్‌ నోటీసు

Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్ అవుట్‌ నోటీసు జారీ చేసింది.

Published : 02 May 2024 14:00 IST

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌ (Prajwal Revanna)లపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసు కర్ణాటక  (Karnataka) రాజకీయాల్లో పెను దుమారానికి దారితీసింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌).. విచారణకు హాజరవ్వాలని ఇటీవల వీరిద్దరికీ నోటీసులు జారీ చేసింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్‌ కోరారు. ఇందుకు తిరస్కరించిన సిట్‌ నేడు ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసింది.

హాసన సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ప్రజ్వల్‌ రేవణ్ణ.. ఈ కేసు వెలుగులోకి రాగానే దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ కేసుపై నిన్న తొలిసారిగా సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. విచారణకు హాజరయ్యేందుకు వారం రోజులు గడువు కావాలని కోరారు. వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని అన్నారు. ఆయన అభ్యర్థనను సిట్‌ తిరస్కరించింది. ఈ క్రమంలోనే లుక్‌అవుట్‌ నోటీసు ఇచ్చింది. దీంతో ప్రజ్వల్‌ దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలు ఉంటుంది. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, విచారణకు సహకరిస్తానని తండ్రి హెచ్‌డీ రేవణ్ణ ఇప్పటికే వెల్లడించారు.

హాసనలో మానహననం?.. ప్రజ్వల్‌ విచారణ దారెటు?

ఎన్డీయే కూటమి అభ్యర్థిగా హాసన నుంచి పోటీ చేసిన ప్రజ్వల్‌పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడంతో పాటు బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రజ్వల్‌, ఆయన తండ్రిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. కాగా.. ప్రజ్వల్‌ పాస్‌పోర్టును రద్దు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న ప్రధాని మోదీకి లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని