Karnataka: ఇంట్లో కూర్చునే వారి గురించి ఎందుకు..? డీకేను ప్రస్తావించడంపై సిద్ధరామయ్య ఫైర్‌

Eenadu icon
By National News Team Updated : 20 Jul 2025 11:49 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక (Karnataka)లో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండటం.. అగ్రనాయకులు వాటిని తోసిపుచ్చడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌  (DK Shivakumar) పేరు ప్రస్తావించాలని సూచించిన వ్యక్తిపై సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో కూర్చునే వాళ్ల గురించి ఎందుకని వ్యాఖ్యానించారు.

మైసూర్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈనేపథ్యంలో డీకే తన ప్రసంగం తర్వాత ముఖ్యమైన పనిమీద బెంగళూరు (Bengaluru)కు బయలుదేరారు. ఆ తర్వాత సీఎం ప్రసంగించేందుకు పోడియం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో ప్రముఖుల గురించి ప్రస్తావించే సమయంలో డిప్యూటీ సీఎం పేరును ప్రస్తావించ లేదు. పార్టీ కార్యకర్త ఒకరు ఈ విషయాన్ని గుర్తుచేయగా.. సీఎం ఆయనపై మండిపడ్డారు.

‘శివకుమార్‌ ఇక్కడ లేరు కదా?దయచేసి వెళ్లి కూర్చొండి. ఆయన బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వారి గురించి కాదు.. వేదికపై ఉన్న నేతల పేర్లను ప్రస్తావించాలి. ఇంట్లో కూర్చున్న వారి గురించి కాదు. ఇక్కడ ఉన్నవారికి ఆహ్వానం పలకాలి. అదే ప్రొటోకాల్‌. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా’ అని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై హస్తం పార్టీ తీవ్ర కసరత్తు చేసింది. చివరకు సీనియార్టీ, ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకొని సిద్ధరామయ్యను హైకమాండ్‌ ఎంచుకుంది. అయితే, రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పీఠంలో మార్పు ఉంటుందని అప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగానే దీనిపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై డీకే, సిద్ధరామయ్య ఇద్దరూ స్పష్టతనిస్తూనే ఉన్నా.. రాజకీయం మాత్రం రసవత్తరంగా మారింది.

Tags :
Published : 20 Jul 2025 11:45 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని