LS polls: ‘నోరు’ జారి.. ‘అవకాశం’ కోల్పోయి!

లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికలో భాజపా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, స్థానికంగా వ్యతిరేకత ఉన్నవారిని పోటీ నుంచి తప్పిస్తోంది.

Updated : 25 Mar 2024 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) భారీ మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోన్న భాజపా.. ప్రత్యర్థులకు తమ అభ్యర్థులపై విమర్శలు గుప్పించే అవకాశం కల్పించకుండా జాగ్రత్త పడుతోంది. ఇందుకోసం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, స్థానికంగా వ్యతిరేకత ఉన్నవారిని పోటీ నుంచి తప్పిస్తోంది. ఈక్రమంలో సీనియారిటీ కూడా లెక్కచేయడం లేదు. తాజాగా ఈ జాబితాలో అనంతకుమార్‌ హెగ్డే కూడా చేరారు.

ఆరుసార్లు ఎంపీ అయినా..!

కర్ణాటకకు చెందిన అనంతకుమార్‌ హెగ్డే (Anantkumar Hegde).. ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా ఎన్నికవుతున్నారు. 28 ఏళ్లలో ఆరు సార్లు గెలిచిన ఆయన.. వరుసగా నాలుగుసార్లు విజయం సాధించడం గమనార్హం. అలాంటి సీనియర్‌ నేత నోటి దురుసుతనమే ఆయన సీటుకు చేటు తెచ్చినట్లు కనిపిస్తోంది. రాజ్యాంగాన్ని మార్చాలంటే భాజపా 400 స్థానాల్లో గెలవాల్సి ఉంటుందని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో హెగ్డే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని పార్టీ కూడా ప్రకటించింది. ఈనేపథ్యంలోనే తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర కన్నడ నుంచి అనంతకుమార్‌ను తప్పించి మాజీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డేకు భాజపా అధిష్ఠానం అవకాశం కల్పించింది.

ఫైర్‌బ్రాండ్‌గా పేరొందినప్పటికీ..

భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకుర్‌ కూడా ఈతరహా పరిస్థితినే ఎదుర్కొన్నారు. భాజపా విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో ఆమెకు (Pragya Singh Thakur) చోటు దక్కలేదు. ఫైర్‌బ్రాండ్‌గా పేరొందినప్పటికీ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం కావొచ్చని  పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గాడ్సేను దేశభక్తుడని గతంలో ఆమె అభివర్ణించడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈవిషయంపై ఇటీవల ప్రజ్ఞా ఠాకుర్‌ స్పందిస్తూ.. తనను క్షమించలేనని ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని వ్యాఖ్యానించారు. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందికి గురిచేశాయని అన్నారు.

సభలో చేసిన వ్యాఖ్యల ఫలితం..

గతేడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల సమయంలో దిల్లీకి చెందిన భాజపా ఎంపీ (సౌత్‌ దిల్లీ) రమేశ్‌ బిధూరీ (Ramesh Bidhuri) లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బహుజన్‌ సమాజ్‌ పార్టీ(BSP)కి చెందిన ఎంపీ డానిష్‌ అలీపై అసభ్య పదజాలంతో దూషించారు. వీటిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడటంతోపాటు భాజపా నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సైతం రమేశ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరకు భాజపా కూడా ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీగా పని చేసినప్పటికీ.. తాజా ఎన్నికల్లో ఆయనను పార్టీ పక్కన పెట్టింది.

ఇలా వివిధ రాష్ట్రాల్లో అనేకమంది సీనియర్లను కూడా భాజపా పక్కనపెట్టింది. పలుచోట్ల సిట్టింగ్‌లను కాదని కొత్త వారికి అవకాశమిచ్చింది. ఝార్ఖండ్‌లో భాజపా మాజీ నేత యశ్వంత్‌సిన్హా కుమారుడు జయంత్‌కు టికెట్‌ ఇవ్వలేదు. అదే రాష్ట్రంలో 3 సార్లు ఎంపీగా పనిచేసిన సుదర్శన్‌ భగత్‌కు టికెట్‌ నిరాకరించింది. పర్వేశ్‌సింగ్‌ వర్మ, మీనాక్షి లేఖి, వరుణ్‌గాంధీ, అశ్వినీ చౌబే వంటి సిట్టింగ్‌లకు టిక్కెట్లు దక్కకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని