Bengaluru : కర్ణాటక డిప్యూటీ సీఎంపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ప్రత్యేక కోర్టు ఆదేశం

భాజపా నేతలు నిరసన తెలిపే చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఐటీసెల్ హెడ్ బీఆర్ నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది

Updated : 07 Feb 2024 22:10 IST

బెంగళూరు: భాజపా నేతలు నిరసన తెలిపే చిత్రాన్ని మార్ఫింగ్ (morphed image) చేసినందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar)తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఐటీ సెల్(Congress IT Cell)  హెడ్ బీఆర్ నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 

1992లో బాబ్రీ మసీదు కూల్చివేత(Babri mosque demolition) సమయంలో ఆందోళనలో పాల్గొన్న కరసేవక్(Kar Sevak) శ్రీకాంత్ పూజారిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసినందుకు వ్యతిరేకంగా భాజపా నాయకులు నిరసన చేపట్టారు. ఇందులోభాగంగా వారు ‘నేను కూడా కరసేవక్‌నే, నన్ను కూడా అరెస్టు చేయండి’ అని రాసున్న ప్లకార్డుల(placards)ను పట్టుకొని నిరసన తెలిపారు.

కాంగ్రెస్ ఐటీ సెల్ ప్లకార్డులపై ఉన్న రాతలను మార్చి మోసాలు, ఇతర అక్రమాలు మేమే చేశాం అనే అర్థం వచ్చేలా మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. ఇదే విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.  భాజపా నాయకులను అవమానపరిచేలా దీనిని కాంగ్రెస్‌ నేతలు మార్చారని పేర్కొంటూ భాజపా లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ యోగేంద్ర హోడఘట్ట, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు.  దీంతో చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసినవారిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని