Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్‌ పిటిషన్‌.. ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Updated : 21 Jul 2023 14:17 IST

దిల్లీ: ‘మోదీ ఇంటి పేరు’పై వ్యాఖ్యలకు నమోదైన పరువు నష్టం కేసు (Defamation case)లో తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాది అయిన గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనికి రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్ట్ 4వ తేదీకి వాయిదా వేసింది.

రాహుల్‌ తరఫున సీనియన్‌ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ శిక్ష కారణంగా రాహుల్‌ 111 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే ఒక పార్లమెంట్‌ సెషన్‌కు దూరమయ్యారని సింఘ్వీ వాదించారు. తాజా సెషన్‌కు కూడా ఆయన దూరం కావాల్సి వచ్చిందని, అందువల్ల త్వరితగతిన దీనిపై విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు.

మమ్మల్ని రంగంలోకి దిగమంటారా.. : సుప్రీంకోర్టు ఆగ్రహం

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఈ పరువునష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ.. లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది.

దీంతో సెషన్స్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కి కిందికోర్టు శిక్ష విధించడం సరైనదేనని హైకోర్టు తెలిపింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాహుల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని