Tejashwi Yadav: సీబీఐపై దాడి ఘటన.. ఇది ఆటవిక రాజ్యం కాదా: తేజస్వి యాదవ్‌

Eenadu icon
By National News Team Published : 24 Jun 2024 13:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పట్నా: ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. యూజీసీ-నెట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంపై బిహార్ లోని నవాడాలో జరిగిన దాడిపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సీబీఐ బృందం కొందరు అనుమానితుల కోసం నవాడాలోని కసియాదిహ్ గ్రామానికి వెళ్లగా అక్కడ వారిపై పలువురు దాడికి పాల్పడ్డారు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేశారు. ఈ దాడిలో సీబీఐ వాహన డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

దీనిపై తేజస్వి యాదవ్‌ సోమవారం ఎక్స్‌ ఖాతా వేదికగా స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో ఆటవిక రాజ్యం(జంగిల్‌ రాజ్‌) విస్తరిస్తుందని మండిపడ్డారు. ‘‘మీరే పేపర్‌ లీక్‌ చేయించి, మీరే దానిపై దర్యాప్తు చేస్తున్న సీబీఐపై దాడి చేయించి, మీరే ఇతరులను ఆటవికులుగా అభివర్ణిస్తారు. ఇప్పుడు మీరు సృష్టిస్తున్నది ఆటవిక రాజ్యం కాదా’’ అంటూ ప్రశ్నించారు. 

ఆర్జేడీ పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 15 ఏళ్ల ఆర్జేడీ పాలన గురించి మాట్లాడుతూ.. భాజపా అగ్ర నాయకులు ఆటవిక రాజ్యం అనే పదాన్ని పదేపదే ఉపయోగించేవారు. ప్రస్తుతం దేశంలో పరీక్ష పేపర్‌ లీకేజీలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో తేజస్వీ భాజపా నాయకుల వ్యాఖ్యలను తిప్పి కొట్టారు.  

యూజీసీ-నెట్‌ పరీక్షలో అవకతవకలపై దేశవ్యాప్తంగా నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ పరీక్షను నిర్వహించింది. 11 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొన్నారు. పరీక్షల్లో సమగ్రత దెబ్బతినే అవకాశం ఉన్నందున రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.  ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ చేస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని