Lions Name controversy: సింహాలకు అక్బర్‌, సీత పేర్లు.. ఆ అధికారిపై వేటు

Lions Name controversy: సింహాలకు అక్బర్‌, సీత పేర్లు పెట్టిన అటవీశాఖ ఉన్నతాధికారిపై త్రిపుర ప్రభుత్వం వేటు వేసింది. దీనిపై ఇటీవల కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Published : 26 Feb 2024 11:36 IST

అగర్తల: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని శిలిగుడి సఫారీ (Bengal Safari) పార్కులో అక్బర్‌, సీత పేర్లు కలిగిన మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం ఇటీవల తీవ్ర వివాదానికి (Lions Name controversy) దారితీసిన విషయం తెలిసిందే. వాటికి ఆ పేర్లు పెట్టడంపై కలకత్తా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కాస్తా దుమారం రేపడంతో త్రిపుర (Tripura) ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్ర అటవీ వ్యవహారాల ప్రిన్సిపల్ చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రబిన్‌ లాల్‌ అగర్వాల్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. 

జంతువుల మార్పిడి కార్యక్రమం కింద బెంగాల్‌ అధికారులు ఫిబ్రవరి 12న త్రిపురలోని సిపాహీజలా జూ పార్క్‌ నుంచి రెండు సింహాలను శిలిగుడి సఫారీ పార్కుకు తీసుకొచ్చారు. ‘అక్బర్‌’, ‘సీత’ పేర్లు కలిగిన ఆ మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. దీనిపై విశ్వహిందూ పరిషత్‌ (VHP) కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర అటవీశాఖ అధికారులే వాటికి ఆ పేర్లు పెట్టారని.. అవి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించింది. వెంటనే ఆడ సింహం పేరు మార్చాలని డిమాండ్‌ చేసింది.

దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. సింహాలకు ఆ పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అనవసర వివాదాలు ఎందుకు సృష్టిస్తారని ప్రశ్నించింది. వెంటనే వాటికి వేరే పేర్లు పెట్టాలని ఆదేశించింది. దీనిపై బెంగాల్‌ ప్రభుత్వం స్పందిస్తూ.. త్రిపుర నుంచి తీసుకొచ్చేటప్పటికే వాటికి ఆ పేర్లు ఉన్నాయని, వాటిని మారుస్తామని కోర్టుకు తెలిపింది.

ఈ వ్యవహారం వివాదాస్పదమవడంతో త్రిపుర ప్రభుత్వం చర్యలకు దిగింది. రాష్ట్ర వైల్డ్‌లైఫ్‌ చీఫ్‌గా ఉన్న అగర్వాల్‌ను వివరణ కోరగా.. తాను ఆ పేర్లు పెట్టలేదని చెప్పారు. అనంతరం దర్యాప్తు చేపట్టగా.. బెంగాల్‌కు అప్పగించే సమయంలో డిస్పాచ్‌ రిజిస్టర్‌లో ఆయనే ఆ సింహాల పేర్లను అక్బర్‌, సీతగా నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో అగర్వాల్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని