Ukraine: రష్యా దండయాత్ర వేళ.. భారత్‌కు ఉక్రెయిన్ మంత్రి

రష్యా దాడితో సతమతమవుతోన్న ఉక్రెయిన్‌ (Ukraine) నుంచి ఓ మంత్రి.. భారత పర్యటనకు రానున్నారు. ఆ దేశ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు.

Published : 08 Apr 2023 14:30 IST

దిల్లీ: ఉక్రెయిన్‌ (Ukraine) విదేశాంగ డిప్యూటీ మంత్రి ఎమైన్‌ జాపరోవా (Emine Dzhaparova) భారత్‌ పర్యటనకు రానున్నారు. ఆదివారం (ఏప్రిల్‌ 9) నుంచి నాలుగు రోజుల పాటు ఆమె దేశంలో పర్యటించనున్నారు. గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా (Russia) దండయాత్రను ప్రారంభించిన తర్వాత నుంచి ఉక్రెయిన్‌ ప్రతినిధులు న్యూదిల్లీకి అధికారిక పర్యటనకు రావడం ఇదే తొలిసారి. (Ukraine Minister India Visit)

జాపరోవా పర్యటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్‌ 9 నుంచి 12 వరకు ఆమె దేశంలో పర్యటిస్తారని పేర్కొంది. ఇందులో భాగంగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి (పశ్చిమ దేశాలకు) సంజయ్‌ వర్మతో జాపరోవా సమావేశం కానున్నట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు.. ఉక్రెయిన్‌లో, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తాజా పరిస్థితులపై వీరిద్దరూ చర్చలు జరపనున్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, డిప్యూటీ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ విక్రమ్‌ మిస్రీతోనే ఉక్రెయిన్‌ మంత్రి భేటీ కానున్నారు. అంతేగాక, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆమె ఉక్రెయిన్‌ పర్యటనకు ఆహ్వానించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. (Ukraine Russia Conflict)

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర విషయంలో భారత్‌ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. అయితే దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను సూచిస్తోంది. సైనిక చర్య మొదలైన నాటి నుంచి ఇరు దేశాల అధ్యక్షులతో భారత ప్రధాని మోదీ పలుమార్లు ఫోన్‌లో సంభాషించిన విషయం తెలిసిందే. యుద్ధానికి ఇది సమయం కాదని, శాంతియుత పరిష్కారాలను అన్వేషించాలని మోదీ హితవు పలికారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం భారత్‌ జీ-20 (G-20) సదస్సుకు అధ్యక్షత వహిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో జీ-20 దేశాధినేతల సమావేశం జరగనుంది. ఆ సదస్సులో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకురావాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ మంత్రి భారత పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు