Lok Sabha: మరో ఎంపీపై అనర్హత వేటు.. లోక్‌సభ సెక్రటేరియేట్‌ నోటిఫికేషన్

ఎంపీ అప్జల్‌ అన్సారీపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియేట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కిడ్నాప్‌, హత్య కేసుల్లో ఆయన దోషిగా తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Updated : 02 May 2023 09:25 IST

దిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన వేళ.. తాజాగా లోక్‌సభ సెక్రటేరియేట్‌ మరో ఎంపీపైనా అనర్హత వేటు వేసింది. కిడ్నాప్‌, హత్య కేసుల్లో 4ఏళ్లు శిక్షపడిన బీఎస్పీ ఎంపీ అఫ్జల్‌ అన్సారీపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియేట్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘‘న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో గాజీపుర్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్జల్‌ అన్సారీ ఎంపీ పదవికి అనర్హుడయ్యారు. 29ఏప్రిల్‌ 2023 నుంచి ఇది వర్తిస్తుంది’’ అని లోక్‌సభ సెక్రెటేరియేట్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్సారీకి అక్కడి ఎంపీ/ఎమ్మెల్యే న్యాయస్థానం 4ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అతడి సోదరుడు ముక్తార్‌ అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో కిడ్నాప్‌, హత్య ఘటనల్లో గ్యాంగ్‌స్టర్‌ నిరోధక చట్టం కింద అన్సారీ సోదరులపై 2007లో  కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ జరిపిన ఉత్తరప్రదేశ్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు శనివారం దోషులుగా తేల్చింది. 1996లో విశ్వహిందూ పరిషత్‌ నాయకుడు నందకిశోర్‌ కిడ్నాప్‌ వ్యవహారం, 2005లో భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసుల్లో ముక్తార్‌ అన్సారీ హస్తం ఉందని ఆరోపణలు రావడంతో 2007లో అతడిపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఇదే అభియోగాలపై ముక్తార్‌ అన్న అఫ్జల్‌పైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ కేసులో వీరిద్దర్నీ దోషులుగా తేల్చుతూ యూపీ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ముక్తార్‌ అన్సారీకి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా, అఫ్జల్‌కు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని