Supreme Court: బ్యాలెట్‌ ఓటింగ్‌తో ఏం జరిగిందో మాకు తెలుసు: సుప్రీంకోర్టు

Supreme Court: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశ జనాభా చాలా ఎక్కువ అని, అలాంటప్పుడు మన ఎన్నికల ప్రక్రియను వాటితో పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Published : 16 Apr 2024 18:00 IST

దిల్లీ: ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ఈవీఎం (EVM) ఓట్లతో వీవీప్యాట్‌ (VVPAT) స్లిప్‌లను క్రాస్‌ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం విచారణ జరిపింది. ఈసందర్భంగా రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటీషనర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. విదేశాలతో మన ఓటింగ్‌ (Voting) ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని సూచించింది.

ఈ పిటిషన్‌పై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. ‘‘జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్‌ బ్యాలెట్ల వద్దకే వచ్చాయి. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని మేం చెప్పడం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నాం. అందుకే మళ్లీ మనం కూడా పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతిని వినియోగించాలి. లేదా వీవీప్యాట్‌ స్లిప్‌లను ఓటర్ల చేతికి ఇవ్వాలి. లేదా ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌ స్లిప్‌లను ఓటర్లే బ్యాలెట్‌ బ్యాక్సుల్లో వేసేలా రూపొందించాలి’’ అని వాదించారు.

‘మీరేం అమాయకులు కాదు’.. పతంజలి కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

దీనికి ధర్మాసనం స్పందిస్తూ జర్మనీ జనాభా ఎంత? అని అడిగింది. 6 కోట్ల మంది అని ఆయన జవాబివ్వగా.. ‘‘మన దేశంలో 97కోట్ల మంది ఓటర్లున్నారు. అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని మీరు కోరుతున్నారు. మేం ఆరు పదుల వయసులో ఉన్నాం. బ్యాలెట్‌ పేపర్లు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో మాకు తెలుసు. మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదు’’ అని ధర్మాసనం తెలిపింది.

ఈసందర్భంగా ధర్మాసనంలోని జస్టిన్‌ దీపాంకర్‌ దత్తా స్పందిస్తూ.. ‘‘జర్మనీతో పోలిస్తే నా సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్‌ జనాభా ఎక్కువ. భారత ఎన్నికల ప్రక్రియను విదేశాలతో పోల్చడం సరికాదు. మనం ఎవరో ఒకరిపై విశ్వాసం ఉంచాలి. ఇలా వ్యవస్థను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నించకూడదు. ఇలాంటి ఉదాహరణలు చూపించొద్దు’’ అని అసహనం వ్యక్తం చేశారు.

విచారణ సందర్భంగా ఓటింగ్‌, ఈవీఎంలను భద్రపర్చడం, కౌటింగ్‌ ప్రక్రియ గురించి ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆరా తీసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసినవారికి కఠిన శిక్ష లేకపోవడంపై ధర్మాసనం పెదవి విరిచింది. ‘‘ఇది తీవ్రమైన అంశం. శిక్ష పడుతుందనే భయం ఉండాలి’’ అని వ్యాఖ్యానించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్‌ 18వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. ఆ మరుసటి రోజే అంటే ఏప్రిల్ 19న లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ జరగనుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని