Chiranjeevi: 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా.. చిరును కలిసిన అజిత్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవి, అజిత్‌ కలిశారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Updated : 29 May 2024 17:47 IST

హైదరాబాద్‌: ఆ కుర్రాడు అప్పుడే హీరోగా తెలుగులో పరిచయమవుతున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్‌కూ దర్శకుడిగా అదే తొలి సినిమా. ఆ మూవీ ప్రారంభం సందర్భంగా దేశంలోని అగ్ర కథానాయకుల్లో ఒకరైన చిరంజీవి (Chiranjeevi) వచ్చి తన అభినందనలు తెలిపారు. హీరో-హీరోయిన్లతో కలిసి ఫొటో కూడా దిగారు. ఆ సినిమా ‘ప్రేమ పుస్తకం’. ఆ హీరో అజిత్‌. ఒక్కో మెట్టు ఎక్కుతూ తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి క్రేజీ ఉన్న హీరోగా అజిత్‌ పేరు తెచ్చుకున్నారు. దాదాపు 20 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన అజిత్‌ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అజిత్‌  కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. మరోవైపు చిరంజీవి కథానాయకుడిగా ‘విశ్వంభర’ రూపొందుతోంది. సోషియో ఫాంటసీ కథతో రానున్న ఈ సినిమా షూటింగ్‌ కూడా ఇక్కడే జరుగుతోంది. ఈ క్రమంలో ‘విశ్వంభర’ సెట్స్‌కు అజిత్‌ వెళ్లారు. అజిత్‌ను సాదరంగా ఆహ్వానించిన చిరు ఆయనతో కలిసి కొద్దిసేపు మాట్లాడారు. ఇద్దరూ తమ సినిమాల గురించి చర్చించుకున్నారు. ఈ క్రమంలో చిరునవ్వులు చిందిస్తూ చిరంజీవి, అజిత్‌ దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 20 ఏళ్ల కిందట ‘ప్రేమ పుస్తకం’ కోసం దిగిన ఫొటోను జత చేస్తూ అభిమానులు సోషల్‌మీడియాలో పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని