Balakrishna: ఓ తల్లికి పుట్టకపోయినా.. మమ్మల్ని కవలలే అంటుంటారు: బాలకృష్ణ

విష్వక్‌ సేన్‌ హీరోగా దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’  ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. దీనికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

Updated : 29 May 2024 00:14 IST

హైదరాబాద్‌: విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి, అంజలి హీరోయిన్లు. ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ (Balakrishna) ముఖ్య అతిథిగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని మంగళవారం నిర్వహించింది. 

బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘సంక్రాంతి, ఉగాదిలానే రామారావు గారి జయంతి కూడా తెలుగువారికి పండగే. ఆయన 101వ జయంతి రోజున ఈ సినిమా వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఒక తల్లికి పుట్టకపోయినా మమ్మల్ని (విష్వక్‌ సేన్‌) కవలలే అంటుంటారు. అతడికంటే నేను చిన్నోడిని (నవ్వుతూ). విష్వక్‌.. నా అన్నయ్య. సినిమాపై అమితాసక్తి ఉన్నవాడు. తొలి సినిమా నుంచి నటనలో వైవిధ్యం చూపిస్తున్నాడు. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టైటిల్‌లో ఓ వైబ్రేషన్‌ ఉంది. సినిమా కిక్‌ ఇచ్చేలా ఉంది. కృష్ణ చైతన్య గతంలో తెరకెక్కించిన ‘రౌడీ ఫెలో’, ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రాలను ఆదరించినట్టే ఈ సినిమానీ ఆదరిస్తారని కోరుకుంటున్నా. నేహాశెట్టి.. కత్తి, అంజలి.. ఖతర్నాక్‌. ‘డీజే టిల్లు’నే భయపెట్టి రాధికగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది నేహాశెట్టి. విష్వక్‌కు తన తల్లిదండ్రులే బ్యాక్‌గ్రౌండ్‌. తన తండ్రి జాతకాలు, వాస్తు చూస్తుంటారు. మనల్ని కాపాడేది దైవం. మా అబ్బాయి మోక్షజ్ఞ కూడా భవిష్యత్తులో ఇండస్ట్రీలోకి రావాలి. తను మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలి. నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దని చెబుతుంటా. త్వరలో మా కాంబోలో (విష్వక్‌తో కలిసి) సినిమాని ప్రకటించబోతున్నాం’’ అని అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు.

బాలకృష్ణ ఫోన్‌ చేయగానే కంటతడి పెట్టుకున్నా: విష్వక్‌ సేన్‌

‘‘ఈ సినిమా చిత్రీకరణలో నాకు ఓ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన బాలకృష్ణగారు ఫోన్‌ చేయగానే కంటతడి పెట్టుకున్నా. తెలుగోడి ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్‌ ఫొటోతోనే మా సినిమాని ప్రారంభించాం. ఆయన 101వ జయంతిన ఈవెంట్‌ నిర్వహించడం ఆనందంగా ఉంది. నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమా. ఎంతో రిస్క్‌ తీసుకుని ఆ చిత్రం చేశాం. ‘నువ్వు ఈ యాటిట్యూడ్‌తో పైకి రావు’ అని నా కెరీర్‌ ప్రారంభంలో మాటలు వినిపించేవి. కానీ, నేను ఏ రోజూ నా క్యారెక్టర్‌ మార్చుకోలేదు’’ అని విష్వక్‌ సేన్‌ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని