Bharatanatyam: కడుపుబ్బా నవ్వించే చిత్రమిది

‘‘ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చిత్రం ‘భరతనాట్యం’. ఈ వేసవిలో ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరిస్తుంది’’ అన్నారు దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర. ‘దొరసాని’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన ఇప్పుడు ‘భరతనాట్యం’తో అలరించేందుకు సిద్ధమయ్యారు.

Updated : 01 Apr 2024 12:03 IST

‘‘ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చిత్రం ‘భరతనాట్యం’. ఈ వేసవిలో ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరిస్తుంది’’ అన్నారు దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర. ‘దొరసాని’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన ఇప్పుడు ‘భరతనాట్యం’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. సూర్యతేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా నటించిన ఈ సినిమాని పాయల్‌ సరాఫ్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. హీరో ఆనంద్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాకిష్టమైన క్రైమ్‌ కామెడీ జానర్‌లో ఈ చిత్రం రూపొందింది. ప్రచార చిత్రాలన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు మహేంద్రతో నేను.. శివాత్మిక ‘దొరసాని’ చేశాం. ఇప్పుడీ చిత్రం కూడా సూర్య తేజతో పాటు మిగిలిన చిత్రబృందానికి మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో దర్శకుడు మహేంద్రలోని వయొలెన్స్‌ను చూస్తారు. ఆయన ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. కచ్చితంగా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు హీరో సూర్యతేజ. దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర కథను చాలా వినోదాత్మకంగా ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సెట్‌ చేసి చెప్పడం జరిగింది. ఇది ఎక్కడా ఓ కొత్త హీరో సినిమాలా అనిపించదు. ఈ చిత్రం మొదలైన ఐదు నిమిషాల తర్వాత ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. దీంట్లో డార్క్‌ కామెడీ హిలేరియస్‌గా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్‌, శివాత్మిక, విరించి వర్మ, మీనాక్షి, పాయల్‌, నవదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని