Atlee: కల నిజమైంది.. పురస్కారంపై అట్లీ ఆనందం

‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకోవడంపై దర్శకుడు అట్లీ ఆనందం వ్యక్తం చేశారు.

Published : 25 Mar 2024 00:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కల నిజమైందంటూ సోషల్‌ మీడియా వేదికగా దర్శకుడు అట్లీ (Atlee) ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకోవడంపై ఆయన పోస్ట్‌ పెట్టారు. ఎన్డీటీవీ ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023- 2024’ అవార్డుల ప్రదానోత్సవాన్ని దిల్లీలో నిర్వహించింది. సినీ, క్రీడలు తదితర రంగాల్లో సేవ చేసిన వారికి ఈ పురస్కారాలు ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ అవార్డులు అందజేశారు. అట్లీతోపాటు సినిమా ఫీల్డ్‌ నుంచి ప్రముఖ నటుడు బాబీ దేవోల్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మహిళా క్రికెటర్‌ శ్రేయాంక పాటిల్‌ కూడా ఉన్నారు. 

‘జవాన్‌’ (Jawan)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అట్లీ విశేష క్రేజ్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అవార్డు అందుకున్న అనంతరం వేదికపై అట్లీ మాట్లాడుతూ.. ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)పై మరోసారి ప్రేమ కురిపించారు. ‘‘షారుక్‌ గ్లోబల్‌ ఐకాన్‌. మాస్‌ జానర్‌లో ఆయనతో ఓ సందేశాన్ని చెప్పించాలనుకున్నా. అది ‘జవాన్‌’తో సాధ్యమైంది. 2019లో నేను, షారుక్‌ ఐపీల్‌ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లాం. మా ఫొటోలు బయటకురాగా ‘ఇతను షారుక్‌తో సినిమా చేయగలడా? అంత సామర్థ్యం ఉందా?’ అని కొందరు నన్ను విమర్శించారు. నిజమైన స్వప్నాలు మిమ్మల్ని నిద్రపోనివ్వవు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని