Balakrishna: యువతరం హీరోల్నే స్ఫూర్తిగా తీసుకోవాలని మోక్షజ్ఞకి చెబుతున్నా

‘‘నాకు సోదరుడితో సమానం విష్వక్‌సేన్‌. తనకి సినిమా అంటే తపన. ఏదో ఒక కొత్తదనం ఇవ్వాలని ప్రయత్నిస్తుంటాడు.

Updated : 29 May 2024 05:16 IST

 ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ వేడుకలో బాలకృష్ణ

‘‘నాకు సోదరుడితో సమానం విష్వక్‌సేన్‌. తనకి సినిమా అంటే తపన. ఏదో ఒక కొత్తదనం ఇవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. మా ఇద్దరిలో ఉన్న సారూప్యం అదే’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ. ఆయన ముఖ్య అతిథిగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా... కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నేహాశెట్టి, అంజలి కథానాయికలు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

వేడుకని ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ధన్యమైన జన్మనిచ్చి ప్రేక్షకులందరి హృదయాల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి నందమూరి తారక రామారావుకు ఘన నివాళులర్పించుకుంటూ, ఆయన జయంతి సందర్భంగా ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్నూ, విష్వక్‌ని కవలలే అంటారు. కొంతమందితోనే నేను సన్నిహితంగా ఉంటా. అందులో విష్వక్‌ ఒకడు. నాలాగే ఉడుకురక్తం, దూకుడు ఉన్న వ్యక్తి. సినిమా సినిమాకీ, పాత్రల మధ్య కొత్తదనం ప్రదర్శిస్తూ ప్రయాణం చేస్తున్నాడు. గోదావరి జిల్లాల నేపథ్యంలో నేనూ సినిమాలు చేశా. గోదావరి అందాలతోపాటు, ఎంతో కిక్‌ ఇచ్చేలా ఉంది ఈ సినిమా ట్రైలర్‌. ప్రేక్షకులకు ముందుగా మనం కొత్తదనం అందించాలి. అప్పుడే వాళ్లు ఆదరిస్తారు. మా అబ్బాయి మోక్షు కూడా పరిశ్రమకి రావాలి. తనని కూడా విష్వక్, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువతరాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటా. నటులు నిత్యావసర వస్తువుల్లా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. నాన్న నుంచి అదే నేర్చుకున్నా. మోక్షు కూడా అదే అనుసరిస్తాడు. మంచి సినిమాలు చేసిన దర్శకుడు కృష్ణచైతన్య, యువన్‌ శంకర్‌ రాజా, అంజలి, నేహా.. ఇలా ప్రతి ఒక్కరికీ ఈ సినిమా గుర్తుండిపోతుంది. తపన ఉన్న నిర్మాత వంశీ. మరో మంచి కలయిక ఉంది. త్వరలోనే దాన్ని ప్రకటించబోతున్నాం’’ అన్నారు.

విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం ఫైట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు రోడ్డుపైన పడిపోయా. దేవుడి దయవల్ల ఏమీ కాలేదు కానీ, ఆ సమయంలో నాకేమైందని చాలామంది టెన్షన్‌ పడ్డారు. నాకు దెబ్బ తగిలిందని తెలిసి బాలయ్య సర్‌ ఫోన్‌ చేసి మాట్లాడినప్పుడు నా కళ్లల్లో నీళ్లొచ్చాయి. కుటుంబం తర్వాత అంత ప్రేమ చూపించారు. తెలుగోడి ఆత్మగౌరవం ఎన్టీఆర్‌ అని రాసి వున్న ఓ పెయింటింగ్‌ నేపథ్యంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టాం. ఆయన జయంతి రోజే ఈ వేడుక జరుగుతోంది. ఐదేళ్ల కిందట ‘ఫలక్‌నుమా దాస్‌’ విడుదలైంది. నోట్లోకి ఐదు వేళ్లు వెళుతున్నాయంటే ఆ సినిమానే కారణం. ఈ పొగరుతో ఉంటే తీసేస్తారు, తొక్కేస్తారు అన్నారు అప్పట్లో. ఏ రోజూ నా క్యారెక్టర్‌ని చంపుకోలేదు. ఏదైతే తగ్గించుకోమన్నారో అది నచ్చే నాకు అభిమానులయ్యారు. ఈ ఐదేళ్లు నన్ను సపోర్ట్‌ చేసిన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని