Venky 75: సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేశ్‌

‘‘నేను ఇన్ని సినిమాలు చేస్తాననుకోలేదు. నాన్న బలమైన కోరిక, అన్నయ్య ప్రోత్సాహంతోనే కథానాయకుడినయ్యా’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్‌. ఆయన 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని ‘వెంకీ 75 కలియుగ పాండవులు - సైంధవ్‌’ పేరుతో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వేడుక నిర్వహించారు.

Updated : 28 Dec 2023 08:10 IST

‘వెంకీ 75 కలియుగ పాండవులు - సైంధవ్‌’ వేడుకలో చిరంజీవి

‘‘నేను ఇన్ని సినిమాలు చేస్తాననుకోలేదు. నాన్న బలమైన కోరిక, అన్నయ్య ప్రోత్సాహంతోనే కథానాయకుడినయ్యా’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్‌. ఆయన 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని ‘వెంకీ 75 కలియుగ పాండవులు - సైంధవ్‌’ పేరుతో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘‘గురువు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘కలియుగ పాండవులు’తో నా ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్‌ తదితర అగ్ర దర్శకులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను. జయాపజయాల్ని చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాల్ని గమనించి ప్రోత్సహించారు. మొదట్లో ‘విక్టరీ’ అనేవారు. తర్వాత ‘రాజా’ అని పిలిచారు. కొన్నాళ్లు ‘పెళ్లికాని ప్రసాద్‌’ అన్నారు. తర్వాత ‘పెద్దోడు’, ‘వెంకీ మామ’ అన్నారు. ఇలా పిలుపు మారినా ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాను. చాలా సార్లు కెరీర్‌ను వదిలి పెట్టి వెళ్లిపోదాం అనుకునేవాణ్ని. అంతలోనే చిరంజీవి వచ్చి ఓ బ్లాక్‌ బస్టర్‌ సినిమాని ఇచ్చేవారు. నా తోటి హీరోలైన బాలకృష్ణ, నాగార్జున వీళ్లంతా పాజిటివ్‌ ఎనర్జీ ఇచ్చేవారు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా చిత్రాలను కొనసాగించా. నా 75వ చిత్రం ‘సైంధవ్‌’ గొప్ప సినిమా అవుతుంది. జనవరి 13న అందర్నీ అలరిస్తుంది. కృషి, పట్టుదల, నిలకడతోనే విజయాలు సాధ్యం అవుతాయి. ఎక్కువ హైరానా పడకుండా సహజంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఏదైనా రావాల్సిన సమయంలోనే వస్తుంది. సానుకూల ధోరణిని అలవరచుకోవడంతోనే నేను సహజంగా ఉంటున్నాను. అందరూ అదే అలవర్చుకోవాలి. నా ప్రయాణంలో కుటుంబం అందించిన ప్రోత్సాహం ఎంతో గొప్పది. చిరంజీవితో కలిసి త్వరలోనే సినిమా చేస్తా’’ అన్నారు.

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘వి అంటేనే విక్టరీ అనే డైలాగ్‌తోనే వెంకటేశ్‌ ప్రయాణం మొదలైంది. అందుకు తగ్గట్టే తన ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. రామానాయుడు నాపై పెట్టిన బాధ్యత మేరకే వెంకటేశ్‌ని తెరకు పరిచయం చేశా. తన ఎదుగుదలకు మాత్రం తను ఎంచుకున్న కథలు, పాత్రలు, తన అన్నయ్యే కారణం. ఇన్ని రకాల సినిమాలు మరే హీరో చేయలేడేమో అనేలా ఆయన కెరీర్‌ కనిపిస్తుంది’’ అన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ ‘‘కొన్ని వేడుకలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాంటి వేడుకే ఇది. వెంకీతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. 1983లో సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో ‘సంఘర్షణ’ అనే సినిమా చేశా. అప్పుడు నిర్మాణ రంగంలో శిక్షణ పొందుతున్న సురేశ్‌బాబు పరిచయమయ్యారు. రామానాయుడికి రెండో అబ్బాయి కూడా ఉన్నాడని అప్పుడే తెలిసింది. ఎలా ఉంటాడు అని అడిగితే ‘ఫర్వాలేదు’ అని చెప్పారు. కానీ కొన్నాళ్ల తర్వాత అందంగా మెరిసిపోతున్న వెంకటేశ్‌ను చూశాను. అప్పుడు నాలో గుబులు మొదలైంది. రామానాయుడు సంస్థలో సినిమా చేయడం నాలాంటి వాళ్లకి అప్పట్లో ఓ భరోసా, దీమా. వాళ్ల అబ్బాయి హీరో అయితే నాకు గట్టిపోటీ ఎదురవుతుందని భయపడ్డా. కానీ తనకు సినిమాలపై ఆసక్తి లేదు రాజా అని రామానాయుడు చెప్పాకా నేను ఊపిరి పీల్చుకున్నా. మళ్లీ రెండేళ్లకు వెంకటేశ్‌ తిరిగొచ్చాడు. కథానాయకుడిగా పరిచయమయ్యాడు. అప్పటి నుంచి మంచి మిత్రులుగా ఒకరి మంచిని మరొకరు కోరుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. కథలో ఎంపికలో ఒక సినిమాకి మరో సినిమాకి పొంతన లేకుండా ప్రయాణం చేస్తున్నాడు వెంకీ. తన ‘మల్లీశ్వరి’ నాకు ఇష్టమైన చిత్రం. కుటుంబం, యాక్షన్‌, ప్రేమ కథలు.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు. ఈ ప్రయాణం అప్రతిహతంగా సాగాలని కోరుకుంటున్నా. మేం కలిసి సినిమా చేయాలనేది తన కోరికా నా కోరికా కూడా. మంచి కథ కుదిరితే నా సోదరుడు వెంకీతో సినిమా చేయడం అత్యంత ఆనందకర విషయం అవుతుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. కెరీర్‌నే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా అందంగా నిర్మించుకున్నాడు. సురేశ్‌బాబు లాంటి అన్నయ్య ఉండటంతోనే అది సాధ్యమైందని భావిస్తుంటా. సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేశ్‌’’ అని చెప్పారు.

నాని మాట్లాడుతూ ‘‘అందరి అభిమానులు ప్రేమించే హీరో వెంకటేశ్‌. తెరపైనా, తెరవెనుక ఆయన జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రతి నటుడి కుటుంబం వెంకటేశ్‌లా ఉండాలని కోరుకుంటుంది’’ అన్నారు. రానా మాట్లాడుతూ ‘‘మా కుటుంబంలో చిన్నాన్న మాకో గురువు. విజయం వచ్చినా పరాజయం ఎదురైనా అంతే సంతోషంగా ఉంటారు. ఆయనవల్లే నేనిలా ఉన్నా’’ అన్నారు. సురేశ్‌ బాబు మాట్లాడుతూ ‘‘ఇన్ని సినిమాలకు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వ్యవసాయ కుటుంబం నుంచి మేము ఈ వ్యాపారంలో ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఎవ్వరినీ నొప్పించని అజాత శత్రువు వెంకటేశ్‌. ఆయన పెరిగిన విధానం, జీవితంపై అవగాహన, ఆలోచన, గొప్పగా ఉంటాయి’’ అన్నారు బ్రహ్మానందం. ఈ కార్యక్రమంలో అనిల్‌ రావిపూడి, బాబీ, శైలేశ్‌ కొలను, శ్రీవిష్ణు, అలీ, నిఖిల్‌, విశ్వక్‌సేన్‌, అడివిశేష్‌, విజయ్‌భాస్కర్‌.కె, ముప్పలనేని శివ, భీమనేని శ్రీనివాసరావు, బెల్లంకొండ సురేశ్‌, టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, వివేక్‌ కూచిభొట్ల, వెంకట్‌ బోయనపల్లి, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా తదితరులు పాల్గొన్నారు.

  • ఈ కార్యక్రమం ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్‌’లో ఈ నెల 31న ప్రసారం కానుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని