Hyper Aadi: తరాలు మారితే టెక్నాలజీ మారుతుంది.. బాలయ్య ఎనర్జీ కాదు: హైపర్‌ ఆది

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హైపర్‌ ఆది.. బాలకృష్ణపై పొగడ్తలు కురిపించారు.

Published : 29 May 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి నటసింహం (బాలకృష్ణ), కొణిదెల కొదమసింహం (పవన్‌ కల్యాణ్‌) కలిసి అసెంబ్లీలో అడుగుపెడితే ఎలా ఉంటుందో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) సినిమా చూసినా అలానే ఉంటుందన్నారు నటుడు హైపర్‌ ఆది (Hyper Aadi). విష్వక్‌సేన్‌ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రమిది. నేహాశెట్టి, అంజలి హీరోయిన్లు. ఆది కీలక పాత్ర పోషించారు. మే 31 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించింది. ప్రముఖ నటుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన్ను ఉద్దేశిస్తూ ఆది మాట్లాడారు.

‘‘ప్రపంచంలో ఎక్కడికెళ్లినా నేను తెలుగు వాడిని అని గర్వంగా, ధైర్యంగా చెప్పుకొంటున్నామంటే దానికి కారణం నందమూరి తారక రామారావు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ, శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్‌ని భావించి ఆయన ఫొటోలు ఇంట్లో పెట్టాం. శ్రీరాముడిగా భావించి చేతులెత్తి ఆయనకు దండం పెట్టాం. ఆయన గాంభీర్యం చూడాలంటే ‘బొబ్బిలి పులి’లోని కోర్టు సన్నివేశం ఒక్కటి చాలు. అలాంటి నటుడు, రాజకీయ నాయకుడు మళ్లీ పుట్టరు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకోవడం ఓ అదృష్టంగా భావిస్తున్నా. తెలుగుజాతి గౌరవాన్ని రామారావుగారు కాపాడితే.. ఆయన గౌరవాన్ని బాలకృష్ణగారు నిలబెడుతూ వస్తున్నారు. ‘బాలకృష్ణ తిట్టారు.. కొట్టారు’ అంటూ కొందరు వార్తలు రాస్తుంటారు. కానీ, ఆయన కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులను నిలబెట్టారు. దాని గురించి రాయాలి. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది పేద వారికి సాయం చేశారు. బాలకృష్ణగారితో పనిచేసే ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉంటాయి’’

‘‘ఒక జనరేషన్‌ వాళ్లు మాకు గుర్తుండిపోయే చిత్రాలు కావాలని అడిగితే ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’లాంటి చిత్రాలు ఇచ్చారాయన. మరో జనరేషన్‌ వాళ్లు యాక్షన్‌ సినిమాలు కావాలంటే ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహారెడ్డి’లాంటివి అందించారు. ఇంకో జనరేషన్‌ వాళ్లు కాలర్‌ ఎగరేసే సినిమాలు అడిగితే ‘సింహా’లాంటివి ఇచ్చారు. జనరేషన్‌ మారితే మనుషులు మారతారు.. టెక్నాలజీ మారుతుంది.. కానీ, బాలయ్య బాబు ఎనర్జీ మారదు. ఆయన గ్రాఫ్‌ పెరగడమే తప్ప తగ్గదు. ఆయన సినిమాల్లో, ఓటీటీలో, రాజకీయాల్లో, సేవ చేయడంలో అన్‌స్టాపబుల్‌. ఆయన రాకతో మా సినిమా కలెక్షన్స్‌ కూడా అన్‌స్టాపబుల్‌ అవ్వాలని కోరుకుంటున్నా’’

‘‘విష్వక్‌ సేన్‌ మంచి నటుడు. అందుకే ఆయన చిత్రాలకు నష్టాలు రావు. 24 క్రాఫ్ట్స్‌పై పట్టున్న వ్యక్తి. మనందరికీ త్రివిక్రమ్‌ అంటే ఇష్టం. ఆయనకు మా దర్శకుడు కృష్ణ చైతన్య అంటే ఇష్టం. అంజలి, నేహాశెట్టి అద్భుతంగా నటించారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది. సోషల్‌ మీడియాలో రివ్యూలు ఇచ్చే వారికి నాదో విజ్ఞప్తి.. నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని రివ్యూలు రాయండి. ఎందుకంటే ఒక సినిమా విజయం అందుకోకపోతే హీరో మనోధైర్యంతో మరో సినిమా చేయొచ్చు. ప్రొడ్యూసర్‌ మనోధైర్యంతోపాటు మనీ కూడా తెచ్చుకోవాలి. తెలుగు సినిమాని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒక హీరోని అభిమానిస్తే మరో హీరోకి వ్యతిరేకమేమో అని అనుకునే వారికి ఓ మాట చెబుతున్నా.. మాకు తెలుగు సినిమా అంటే పిచ్చి, తెలుగు హీరోలంటే పిచ్చి. ఇండస్ట్రీ బాగుంటే అందరం బాగుంటామని భావిస్తాం’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని