Manchu Manoj: వారిద్దరు టామ్‌ అండ్‌ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్‌ డైలాగ్‌

రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్‌ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.

Published : 28 Mar 2024 00:04 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటులు చిరంజీవి (Chiranjeevi), మోహన్‌ బాబు (Mohan Babu) టామ్‌ అండ్‌ జెర్రీ లాంటి వారని, గొడవ పడుతూ కలిసిపోతుంటారని హీరో మంచు మనోజ్‌ (Manchu Manoj) అన్నారు. రామ్‌ చరణ్‌ (Ram Charan) తన ప్రాణ స్నేహితుడని పేర్కొన్నారు. బుధవారం చరణ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో వేడుకలు (Ram Charan Birthday Celebrations) నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని సందడి చేశారు. ఈ ఈవెంట్‌కు మనోజ్‌తోపాటు హీరోలు నిఖిల్‌, కిరణ్‌ అబ్బవరం, దర్శకులు బుచ్చిబాబు, బాబీ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

మనోజ్‌ మాట్లాడుతూ..‘‘చరణ్‌ ఎంత గొప్ప నటుడో అంత గొప్ప మనిషి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చలించిపోయి వెంటనే సాయం చేస్తాడు. ఇలాంటి వారు అరుదు. ఓ తెలుగు కుటుంబం దుబాయ్‌లో పలు సమస్యలు ఎదుర్కొంటుందని నాకు తెలిసింది. అప్పుడు నేను యూఎస్‌లో ఉన్నా. ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో రామ్‌ చరణ్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పా. ‘నా వంతు సాయం చేశా ఇంకా రూ. ఐదు లక్షలు తక్కువయ్యాయి’ అని అనగానే బ్యాంకు ఖాతా వివరాలు పంపించు అన్నాడు. నేను డిటైల్స్‌ సెండ్‌ చేసిన తక్షణమే డబ్బు పంపాడు. ఆ ఫ్యామిలీ ఆశీస్సులు చరణ్‌కు ఎప్పుడూ ఉంటాయి. తను స్నేహానికీ విలువనిస్తాడు. బాల్య మిత్రులతో ఇప్పటికీ కాంటాక్ట్‌లో ఉంటాడు’’ అని పేర్కొన్నారు.

‘‘మీ నాన్న, రామ్‌ చరణ్‌ నాన్న గొడవ పడుతుంటారు, కలిసిపోతుంటారు. మీరెలా (చరణ్‌, మనోజ్‌) ఇంతకాలంగా ఒకేలా ఉండగలిగారు?’ అని ఒకరు నన్ను అడిగారు. భార్యాభర్తల విషయాల్లో కలగజేసుకున్న వ్యక్తిని ఏమంటారో తెలుసా? అని నేను ఆయన్ను ప్రశ్నించా. వాళ్లిద్దరు టామ్‌ అండ్‌ జెర్రీ లాంటి వారు. దాదాపు 45 ఏళ్ల బంధం వారిది. మాలాగే ఆ ఇద్దరు ఎల్లకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ‘పెదరాయుడు’ సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌ను రీక్రియేట్‌ చేసి, అభిమానుల్లో జోష్‌ నింపారు. ‘ఎ రిలేషన్‌ బెట్వీన్‌ మెగా ఫ్యామిలీ అండ్‌ మంచు ఫ్యామిలీ షుడ్‌బీ లైక్‌ ఎ ఫిష్‌ అండ్‌ వాటర్‌. బట్‌ షుడ్‌నాట్‌ బీ లైక్‌ ఎ ఫిష్‌ అండ్‌ ఫిషర్‌మ్యాన్‌’ అనే సంభాషణకు ఫ్యాన్స్‌ కేరింతలతో ప్రాంగణం హోరెత్తింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని