Rajamouli Mahesh Babu: ఒకే వేదికపై సందడి చేయనున్న రాజమౌళి- మహేశ్‌.. ఎక్కడంటే?

రాజమౌళి, మహేశ్‌ బాబు ఒకే వేదికపై సందడి చేయనున్నారు. ఏ ఈవెంట్‌లో అంటే?

Published : 27 Nov 2023 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు (Mahesh Babu), అగ్ర దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ఒకే వేదికపై సందడి చేయనున్నారు. ఎక్కడ, ఎప్పుడు? అంటే.. బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ‘యానిమల్‌’ (Animal) చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. డిసెంబరు 1న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ (దూలపల్లి)లో సోమవారం (నవంబరు 27) సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. ఆ ఈవెంట్‌కు మహేశ్‌, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం ఈ వివరాలు ప్రకటించడమే ఆలస్యం సినీ ప్రియులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సందీప్‌ రెడ్డి ఒరిజినల్‌ డైరెక్టర్‌.. ఆ సీక్వెన్స్‌ ఆలోచన వారిదే: రణ్‌బీర్‌ కపూర్‌

రాజమౌళి- మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం విధితమే. ప్రీ ప్రొడక్షన్స్‌ దశలో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబో గురించి ఏ చిన్న విషయం బయటకొచ్చినా నెట్టింట అది క్షణాల్లోనే వైరల్‌ అవుతుంది. అలాంటిది ఇప్పుడు వారిద్దరే ప్రత్యక్షంగా కలుసుకోబోతుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాంతో, క్షణాల్లోనే ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో #MaheshBabu, #SSMB29 (వీరిద్దిరి కాంబోలో తెరకెక్కనున్న సినిమా వర్కింగ్‌ టైటిల్‌) హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

‘యానిమల్‌’ విషయానికొస్తే.. తండ్రి, కొడుకుల నేపథ్యంలో ఎమోషనల్‌ డ్రామాగా రూపొందింది. రష్మిక కథానాయిక. అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రధారులు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు విశేష ఆదరణ దక్కింది. అడ్వాన్స్‌ బుక్సింగ్స్‌లోనూ ఈ సినిమా హవా చూపించింది. ఆన్‌లైన్‌లో బుకింగ్స్‌ ఓపెన్‌ అయిన 24 గంటల్లోపే టికెట్లు (డిసెంబరు 1 షోస్‌కు సంబంధించి) హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని