Rashmika: ‘యానిమల్‌’ సక్సెస్.. అందుకే ఆస్వాదించలేకపోయా: రష్మిక

తానెందుకు ‘యానిమల్‌’ సినిమా విజయాన్ని ఆస్వాదించలేకపోయిందో నటి రష్మిక తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Updated : 25 Feb 2024 15:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్న కథానాయికల్లో రష్మిక (Rashmika Mandanna) ఒకరు. ‘యానిమల్‌’ (Animal) సినిమాతో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సక్సెస్‌ను ఆమె సెలబ్రేట్‌ చేసుకోకపోవడంపై బాలీవుడ్‌లో చర్చ జరిగింది. తాను ఇంటర్వ్యూలు, సినిమాకి సంబంధించి వేడుకల్లో పాల్గొనకపోవడంపై పలు రకాల ఊహాగానాలు వినిపించాయి. వాటిపై రష్మిక సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. తన కొత్త సినిమా సెట్స్‌లో దిగిన ఫొటోలను పంచుకుంటూ ‘యానిమల్’ సక్సెస్‌ను తానెందుకు ఆస్వాదించలేకపోయారో వివరించారు.

‘‘మేం (యానిమల్‌ టీమ్‌) అందించిన భారీ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ప్రశంసలు కురిపించారు. ఆ విజయాన్ని ఆస్వాదించడానికి నేనూ కొంత సమయం కేటాయించాలనుకున్నా. కానీ, ‘యానిమల్‌’ విడుదలైన మరుసటి రోజే మరో సినిమా చిత్రీకరణలో పాల్గొన్నా. నాకు పని పట్ల ఎంత నిబద్ధత ఉందో అర్థం చేసుకోండి (నవ్వుతూ..). ఇంటర్వ్యూల్లోనూ, విజయోత్సవ వేడుకల్లోనూ పాల్గొనలేకపోయా. ప్రతిష్ఠాత్మక చిత్రాల షూటింగ్స్‌ కోసం రాత్రుళ్లు కూడా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. మీరు నన్ను మిస్‌ అవుతున్నారని నాకు తెలుసు. ఆ లోటును నేను నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులు భర్తీ చేస్తాయని భావిస్తున్నా. అవి మిమ్మల్ని విశేషంగా అలరిస్తాయి. మీరు వాటిని చూస్తూ ఎంజాయ్‌ చేసే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అన్నింటికీ మించి మీ ప్రేమే నాకు సంతోషాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నారు.

రష్మిక షేర్‌ చేసిన ఫొటోల్లో ఆమె ముఖం పూర్తిగా కనిపించలేదు. ముఖానికి అడ్డుగా ఫోన్‌ పెట్టారు. తన కొత్త సినిమాలోని పాత్ర కోసం రెడీ అయ్యాయని, అందుకే ఫుల్‌ ఫేస్‌ చూపించలేకపోతున్నానని తెలిపారు. అధికారికంగా చిత్ర బృందం విడుదల చేయకుండా లుక్‌ బయటపెట్టడం సబబు కాదన్నారు. షూటింగ్‌ చాలా బాగా జరుగుతోందని పేర్కొన్నారు. అదే సినిమానో చెప్పలేదు. ‘పుష్ప 2’, ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘ఛావా’ (హిందీ) సినిమాలతో బిజీగా ఉన్నారామె.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని