Trisha: ఇలాంటి వారిని చూస్తుంటే అసహ్యంగా ఉంది: త్రిష

ప్రముఖ నటి త్రిష సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ చర్చనీయాంశమైంది. ఏం జరిగిందంటే?

Updated : 20 Feb 2024 18:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉందంటూ ప్రముఖ నటి త్రిష (Trisha) అసహనం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇకపై తాను ఇచ్చే సమాధానం లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచే వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ పెట్టారు. తన అసహనానికి కారణమేంటో చెప్పలేదు.

తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే పార్టీ మాజీ లీడర్‌ ఏవీ రాజు చేసిన ఆరోపణలపైనే ఆమె స్పందించారని తెలుస్తోంది. ఎమ్మెల్యే జి.వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన రాజు, త్రిష వ్యక్తిగత జీవితంపైన కూడా కామెంట్‌ చేశారు. సదరు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన త్రిష అభిమానులు, నెటిజన్లు ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోండంటూ రిప్లై ఇచ్చారు. ‘త్రిష.. మీకు మేం ఉన్నాం’ అంటూ పలువురు సినీ తారలు సైతం మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే నటి రియాక్ట్ అయినట్లు సమాచారం. ఇంతకుముందు నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కెరీర్‌ ప్రారంభించి 20 ఏళ్లకుపైనే అయినా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారామె. గతేడాది మూడు చిత్రాలతో అలరించి, ఇప్పుడు ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ‘స్టాలిన్‌’ తర్వాత చిరంజీవి సరసన త్రిష నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని