Chiranjeevi: ఫుల్‌ స్వింగ్‌లో ‘విశ్వంభర’.. అది సినిమాకే హైలైట్‌..!

చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది.

Published : 02 Apr 2024 17:35 IST

హైదరాబాద్‌: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ ‘విశ్వంభర’ (Vishwambhara). త్రిష (Trisha) కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం మరో ఆసక్తికర అప్‌డేట్‌ను పంచుకుంది. ఇటీవల షెడ్యూల్‌లో కొంత టాకీ పార్ట్‌, ఓ పాటను పూర్తి చేయగా, ఇప్పుడు అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తోంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సెట్‌లో చిరంజీవి, కొంతమంది ఫైటర్ల మధ్య దీన్ని చిత్రీకరిస్తున్నారు. యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు రామ్‌ లక్ష్మణ్‌ పర్యవేక్షణలో ఈ షూట్‌ జరుగుతోంది.

భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. థియేటర్‌లో కూర్చొన్న ప్రేక్షకుడికి మరింత థ్రిల్‌ పంచుతుందట. ఈ సినిమా కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చిరంజీవి కనిపించనున్నారు. ఇప్పటివరకూ ఆయన నటించిన సినిమాలతో పోలిస్తే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘విశ్వంభర’ తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్‌. ఆమెతో పాటు, సురభి, ఇషాచావ్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని