Amit Shah: ఓటమి తర్వాత.. ఈవీఎంలపై నిందలే : అమిత్‌ షా

లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం కాంగ్రెస్‌, ఎస్పీలు ఈవీఎంల పనితీరుపై నిందలు వేస్తాయని కేంద్రమంత్రి అమిత్‌ షా ఆరోపించారు.

Published : 29 May 2024 16:18 IST

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ (Congress), సమాజ్‌వాదీ పార్టీ (SP)లపై కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆ రెండు పార్టీలు.. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లను నిందించేందుకు ముందుగానే పథకం వేశాయని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న షా.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. 

ఈ ఎన్నికల్లో భాజపా గెలుపు దిశగా పయనిస్తోందని అమిత్‌ షా పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ మార్క్‌ను దాటిందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓటమి అనంతరం ఆ రోజు మధ్యాహ్నం వరకు ఇద్దరు యువరాజులు (రాహుల్‌ గాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌లను ఉద్దేశిస్తూ) మీడియా సమావేశం ఏర్పాటుచేస్తారు. ఈవీఎంలలో తప్పిదాలు ఉన్నాయని.. వారి ఓటమికి అదే కారణమని మెషీన్లను నిందించడం పక్కా. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. వారి పథకాన్ని అమలుచేయాలని ఇప్పటికే నిర్ణయించుకుని ఉంటారు’’ అని జోస్యం చెప్పారు. 

భాజపా 200 మార్కును దాటదు: ఖర్గే

ఇదేమీ జనరల్‌ స్టోర్‌ కాదు..

‘‘ఇప్పటివరకు భాజపా 310 సీట్ల మార్క్‌ను దాటింది. రాహుల్‌ బాబా పార్టీ 40 స్థానాలు.. మరో యువరాజు (అఖిలేశ్‌ యాదవ్‌) 4 సీట్లను గెలవడం కూడా కష్టమే. ఇప్పటివరకు ఆ కూటమిలో ప్రధాని అభ్యర్థి లేరు. దేశమంటే జనరల్‌ స్టోర్‌ కాదు. ఇక్కడ 130 కోట్ల మంది జనాభా ఉంది. మీరు దేశానికి ప్రధానిగా సమర్థవంతంగా బాధ్యత వహించగలరా?’’ అని షా ప్రశ్నించారు. 

భాజపాకు భయం లేదు.. 

పీవోకే గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయని కొందరు నేతలు చెబుతున్నారు. ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారు. కానీ, భాజపాకు అటువంటి భయాలేమీ లేవు. పీవోకే ఎప్పటికీ భారత్‌లో భాగమే. త్వరలో దాన్ని తిరిగి దక్కించుకుంటాం’’ అని మరోసారి అమిత్‌ షా స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు