Amit Shah: మళ్లీ వచ్చేది మోదీ సర్కార్‌.. పీవోకే విలీనం పక్కా: అమిత్‌ షా

కేంద్రంలో మూడోసారి భాజపా అధికారం సాధిస్తుందని కేంద్రమంత్రి అమిత్‌ షా దీమా వ్యక్తంచేశారు. భారత్‌లో పీవోకే విలీనం ఖాయమని మరోసారి పేర్కొన్నారు. 

Published : 20 May 2024 19:49 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమయంలో పీవోకే అంశాన్ని లేవనెత్తిన భాజపా.. ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah) ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. కచ్చితంగా పీవోకే మన దేశంలో విలీనం అవుతుందని పేర్కొన్నారు. హరియాణాలోని కర్నల్‌లో సోమవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న షా.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్‌ 370’ను కాంగ్రెస్‌ తన హయాంలో రద్దు చేయలేకపోయింది. అందుకు కారణం బుజ్జగింపు రాజకీయాలే. అక్కడ ఉగ్రవాద చర్యలు పెరిగిపోయినప్పటికీ అడ్డుకోలేపోయింది. కానీ, మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఆర్టికల్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం కశ్మీర్‌లో మన త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. మళ్లీ వచ్చేది మోదీ సర్కార్‌. త్వరలో పీవోకే భారత్‌లో విలీనం అవుతుంది’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

‘బ్రాండ్‌ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

మైనారిటీ ఓటు బ్యాంకును పొందేందుకే కాంగ్రెస్‌ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనలేదని షా ఆరోపించారు. ‘‘ఖర్గే జీ.. మీరు ఎనిమిది పదుల వయసులో ఉన్నా.. దేశ పరిస్థితి గురించి సరిగా అర్థం చేసుకోలేపోయారు. కానీ, హరియాణా యువత కశ్మీర్‌ కోసం తమ ప్రాణాలు ఇవ్వగలరు’’ అని విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని