BJP: జగన్‌ వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర: పురందేశ్వరి

వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు.

Updated : 12 Feb 2024 20:52 IST

అమరావతి: వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ప్రస్తావించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. విజయవాడ భాజపా కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. సీఎం వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందని.. వచ్చే ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతో లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. వైకాపా తమ అభ్యర్థులతోపాటు ఓటర్లను కూడా ఒక చోటు నుంచి మరొక చోటుకు బదిలీ చేస్తోందని ఆరోపించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వీటిని నిలువరించాలని కోరారు. ఈనెల 20 నుంచి 29 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిల్లో ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ పాలన, నాయకత్వం పట్ల ఆకర్షితులై ఆరు జిల్లాల్లో పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నాయకులు భాజపాలో చేరుతున్నారని తెలిపారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి ఏలూరు రామచంద్రారెడ్డి, కావూరి వాసు, ఐనాబత్తిన సుబ్బారావు, ఖాదర్ వలీసబ్బీ, రామచంద్రారెడ్డి తదితరులకు పురందేశ్వరి భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని