Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి

నాగార్జున సాగర్‌ వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. తాము తెలంగాణ భూభాగంలోకి వెళ్లలేదని చెప్పారు.

Published : 01 Dec 2023 14:02 IST

అమరావతి: నాగార్జున సాగర్‌ వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. తాము తెలంగాణ భూభాగంలోకి వెళ్లలేదని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘నాగార్జునసాగర్‌ వద్ద గురువారం మేం చేసిన చర్య న్యాయమైనది, ధర్మమైనది, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేది. రాష్ట్ర విభజన సమయంలో సాగర్‌ గేట్లను సమంగా పంచారు. ఏపీ గేట్లను కూడా తెలంగాణ అధికారులే ఆపరేట్‌ చేస్తున్నారు. కుడి కాల్వ నిర్వహణ తెలంగాణ చేతుల్లోకి ఎందుకు వెళ్లిందో ఆలోచించాలి. ఏపీ భూభాగంలోనూ తెలంగాణ పోలీసుల చెక్‌పోస్టులు ఉన్నాయి. మేం తెలంగాణ వారి గేట్లు ఆపరేట్‌ చేయలేదు. తాగునీటి కోసం కూడా తెలంగాణ అనుమతి తీసుకోవాలా? 2వేల క్యూసెక్కులు తాగునీటి కోసం విడుదల చేశాం.

తెలంగాణలో మా పార్టీ లేదు. అక్కడ ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు. మా నీటిని విడుదల చేసుకునే స్వేచ్ఛ మాకు కావాలి. శ్రీశైలం ఎడమ విద్యుత్‌ కేంద్రాన్ని తెలంగాణ వాడుకుంటోంది. పరిమితికి మించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. ఏపీ హక్కులను సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ తెలంగాణ దయాదాక్షిణ్యాలపైనే మేం ఉన్నాం. తెలంగాణ వాటా మేం అడగం.. మా వాటా వదులుకోం. ఇకపై ఏపీ వాటా వినియోగంపై మేమే నిర్ణయం తీసుకుంటాం’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని