Kejriwal: కేజ్రీవాల్‌ ‘ఆలోచనలను’ నిర్బంధించలేరు - పంజాబ్‌ సీఎం

అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను కటకటాల వెనక్కి పంపవచ్చేమో కానీ, ఆయన ఆలోచనలు, తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు.

Published : 12 Apr 2024 19:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను జైల్లో పెట్టవచ్చేమో కానీ ఆయన ఆలోచనలు, తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) పేర్కొన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ చేసే ఆలోచనలు దిల్లీ, పంజాబ్‌లలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో (Lok Sabha Elections) పాల్గొన్న మాన్‌.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే, ఆమ్‌ఆద్మీ పని అయిపోతుందని భావించారు. కటకటాల వెనక్కి పంపవచ్చేమో కానీ, ఆయన ఆలోచనలను ఎలా నిర్బంధించగలరు? భాజపా అబద్ధాలు చెబుతూనే ఉంది. ఇది ఎంతోకాలం కొనసాగదని ప్రజలు గ్రహించారు’ అని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు. ఒక్క కేజ్రీవాల్‌ను వాళ్లు (భాజపా) అరెస్టు చేయగరేమో కానీ, దేశవ్యాప్తంగా పార్టీ సిద్ధాంతాలను పాటించే వేల మందిని ఏమీ చేయలేరన్నారు.

‘ఇజ్రాయెల్‌, ఇరాన్‌లకు వెళ్లొద్దు’.. భారత పౌరులకు విదేశాంగశాఖ అలెర్ట్‌

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అత్యంత అవినీతిపరుడని కేంద్ర మంత్రి అమిత్‌ షా 2015లో విమర్శలు గుప్పించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని భగవంత్‌ మాన్‌ అన్నారు. భాజపాలోకి రాగానే హిమంతపై ఉన్న మరకలు తొలగిపోయాయని విమర్శించారు. ఇలా ప్రజలను ఎంతకాలం మభ్యపెట్టగలరని పంజాబ్‌ సీఎం ప్రశ్నించారు. విద్యార్థులు లేరనే కారణంతో అస్సాంలో వేల సంఖ్యలో పాఠశాలలను మూసివేశారని, ప్రభుత్వ బడులపై ప్రజలకు విశ్వాసం తగ్గడమే ఇందుకు కారణమని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని