BJP Manifesto: సార్వత్రిక ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా

 సార్వత్రిక ఎన్నికలకు ‘సంకల్ప పత్రం’ పేరుతో భాజపా మేనిఫెస్టోను విడుదల చేసింది.  దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ దీన్ని ఆవిష్కరించారు.

Updated : 14 Apr 2024 18:28 IST

దిల్లీ:  సార్వత్రిక ఎన్నికలకు ‘సంకల్ప పత్రం’ (BJP Manifesto) పేరుతో భాజపా (BJP) మేనిఫెస్టోను విడుదల చేసింది. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ దీన్ని ఆవిష్కరించారు. మోదీ గ్యారంటీ, 2047 నాటికి వికసిత భారత్‌ థీమ్‌తో రూపొందించారు. 

రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. మేనిఫెస్టో కోసం దాదాపు 15 లక్షల సలహాలు సూచనలు పరిశీలించింది. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా దీనిని రూపొందించినట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి.

14 అంశాల ఆధారంగా..

మేనిఫెస్టోలో 14 అంశాలను చేర్చారు. అందులో విశ్వబంధు, సురక్షిత భారత్‌, సమృద్ధ భారత్‌, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్‌, అత్యుత్తమ శిక్షణ, క్రీడావికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్‌ ఉన్నాయి.

మేనిఫెస్టోలోని కీలక అంశాలు..

  • 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
  • మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం
  • మరో ఐదేళ్లు ఉచిత రేషన్‌
  • పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ వంటగ్యాస్‌
  • ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు
  • దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం
  • ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్‌ భారత్‌
  • వృద్ధుల కోసం ఆయుష్‌ శిబిరాల నిర్వహణ
  • పుణ్యక్షేత్రాల పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో వృద్ధులకు చేయూత
  • మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక
  • పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన ద్వారా ఉచిత విద్యుత్తు
  • డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు
  • కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు
  • మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
  • మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం ప్రత్యేక క్లస్టర్లు
  • ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
  • చిన్నరైతుల లబ్ధి కోసం శ్రీఅన్న సాగు ప్రోత్సాహం
  • ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర పెంపు
  • వ్యవసాయ మౌలికవసతుల మిషన్‌ ప్రారంభం
  • వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక ఉపగ్రహం
  • సేవారంగంతో స్వయం సహాయక సంఘాల అనుసంధానం
  • ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్‌ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు
  • తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి
  • ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే కొత్త శాటిలైట్‌ పట్టణాల ఏర్పాటు
  • విమానయాన రంగానికి ఊతం
  • విద్యుత్తు వాహన రంగానికి ప్రోత్సాహం
  • వందేభారత్‌ విస్తరణ
  • దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్‌ రైలు
  • రక్షణ, వంటనూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి
  • గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహం
  • గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్నోవేషన్‌, లీగల్‌ ఇన్సూరెన్స్‌, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌ల ఏర్పాటు
  • అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు కచ్చితమైన ప్రణాళిక
  • విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీ
  • ఉద్యోగ నియామకాల్లో పేపర్‌ లీకేజీల నివారణకు కఠిన చట్టం, పారదర్శకంగా నియామక ప్రక్రియ
  • అంకురాలకు నిధులు, మెంటార్‌షిప్‌తో మద్దతు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని