Kcr: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు: కేసీఆర్‌

తన రాజకీయ ఎదుగుదలలో మెతుకు సీమది కీలక పాత్ర అని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు.

Updated : 16 Apr 2024 20:03 IST

సంగారెడ్డి: తన రాజకీయ ఎదుగుదలలో మెతుకు సీమది కీలక పాత్ర అని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలోని సింగూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన ‘భారాస ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్‌లో భారాస సభ్యులు ఉండాలన్నారు. మెదక్‌ జిల్లా ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే తెలంగాణ సాధించానన్నారు. 

అవమానిస్తే చూస్తూ కూర్చుందామా?

‘‘అంబేడ్కర్‌ను గుండెల్లో పెట్టుకోవాలనే సచివాలయం ఎదురుగా 125 అడుగుల విగ్రహం పెట్టుకున్నాం. ఆయన జయంతి రోజున విగ్రహం దగ్గరకు ఈ ప్రభుత్వం వెళ్లనేలేదు. కనీసం పూలు పెట్టలేదు..నివాళులర్పించలేదు. నేను నిర్మించానని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు వెళ్లలేదు. మరి సచివాలయం నేనే నిర్మించా.. అందులో కూర్చుంటున్నారు కదా! యాదాద్రి ఆలయం నేనే నిర్మించా.. మూసేస్తారా? అంబేడ్కర్‌ను అవమానిస్తే చూస్తూ కూర్చుందామా? అవమానించిన వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామన్నారు. నాలుగు నెలలు గడిచినా చేయలేదు. మళ్లీ.. ఆగస్టు 15లోపు అంటున్నారు. వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేయాలి. దీని కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం. రుణమాఫీ, వరికి బోనస్‌ కోసం పోస్టుకార్డు ఉద్యమం చేయాలి.

స్వయంగా ముఖ్యమంత్రే జంప్‌ కొడతారేమో..

హామీలు అమలు చేయాలని అడిగితే బూతులు తిడుతున్నారు. నేను పదేళ్లు సీఎంగా ఉన్నా.. ఏ నాడూ ఇలా మాట్లాడలేదు. ఎవరినీ వేధించలేదు, దౌర్జన్యం చేయలేదు. ఆలోచించకుండా ఓటు వేసి ఇప్పటికే దెబ్బతిన్నాం. ప్రజాస్వామ్యంలో బాగా ఆలోచించి ఓటు వేయాలి. మేం కడుపులో పెట్టుకుని కాపాడుకున్న రైతులు ఇవాళ ఆగం అయ్యారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, సాగుకు కరెంటు లేదు. కాంగ్రెస్‌ ఐదేళ్లు అధికారంలో ఉండాలి, అప్పుడే మంచి.. చెడుకి మధ్య తేడా తెలుస్తుంది. కానీ, ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. ఎవరు ఎప్పుడు భాజపాలో చేరుతారో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రే జంప్‌ కొడతారేమో తెలియదు. భాజపాకు ఓటు వేసినా.. మంజీరా నదిలో వేసిన ఒకటే. భాజపా మనకు అక్కరకు రాని చుట్టం, దాన్ని వదిలేసుకోవాలి’’ అని కేసీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని