Anand Sharma: ‘కులగణన దివ్యౌషధం కాదు’.. కాంగ్రెస్‌లోనే అసమ్మతి స్వరం!

కులగణన డిమాండ్‌పై సీడబ్ల్యూసీ సభ్యుడు ఆనంద్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ గుర్తింపు రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు.

Published : 21 Mar 2024 16:50 IST

దిల్లీ: కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే జాతీయస్థాయిలో కులగణన (Caste Census) చేపడతామంటూ కాంగ్రెస్‌ (Congress) విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇటీవలి భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలోనూ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై తాజాగా సొంత పార్టీలోనే అసమ్మతి వ్యక్తం కావడం చర్చనీయాంశమైంది. ‘కులగణన’ దివ్యౌషధం కాదని.. నిరుద్యోగం, అసమానతలను తొలగించదని సీనియర్‌ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు ఆనంద్‌శర్మ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ గుర్తింపు రాజకీయాలు చేయలేదని పేర్కొంటూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు.

‘‘న జాత్‌ పర్‌ న పాత్‌ పర్‌.. మొహర్‌ లగేగీ హాథ్‌ పర్‌ (కులాలపై కాదు.. హస్తం గుర్తుపైనే ఓటు ముద్ర)’ అని 1980లో ఇందిరాగాంధీ ఎన్నికల నినాదం చేశారు. 1990లో రాజీవ్‌గాంధీ సైతం కులతత్వాన్ని ఎన్నికల అంశంగా మార్చడాన్ని వ్యతిరేకించారు. కులతత్వంపై కాంగ్రెస్‌ చారిత్రక వైఖరిని ఇవి చాటిచెబుతున్నాయి. అలాంటిది ఇప్పుడు దీనినుంచి దూరం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇందిర, రాజీవ్‌ల వారసత్వాన్ని అగౌరవపరిచినట్లు తప్పుడు సందేశం వెళ్లే ప్రమాదం ఉంది. ‘ఇండియా’ కూటమికి చెందిన కొన్ని పార్టీలు చాలాకాలంగా కుల రాజకీయాలు చేస్తున్నాయి. కానీ.. సామాజిక న్యాయంపై పార్టీ వైఖరి సమతుల్యంగా ఉండాలి’’ అని పేర్కొన్నారు.

‘వాట్సప్‌లో వికసిత భారత్‌ సందేశాలు ఆపండి’: కేంద్రానికి ఈసీ ఆదేశం

దేశంలోని ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే కచ్చితంగా కులగణన చేపట్టాల్సిందేనని హస్తం పార్టీ చెబుతోంది. ఇది దేశాభివృద్ధికి దోహదం చేసే ఓ ‘ఎక్స్‌రే’ లాంటిదని రాహుల్‌గాంధీ పలుమార్లు పేర్కొన్నారు. రాజ్యాంగంలో 50 శాతానికే పరిమితం చేసిన రిజర్వేషన్లను అదనంగా పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని