Chandrababu: ఏపీలో కూటమికి 160కిపైగా అసెంబ్లీ సీట్లు వస్తాయి : చంద్రబాబు

ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Updated : 23 Mar 2024 17:04 IST

విజయవాడ : ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కసరత్తు చేశామని చెప్పారు. సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదన్నారు. తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన, భాజపా నేతలు కూడా హాజరయ్యారు. ఇందులో చంద్రబాబు పాల్గొని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

‘‘ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం కనబడుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. పొత్తులో భాగంగా 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం. వాళ్లు చేసిన త్యాగం నేనెప్పుడూ మరచిపోను. సీట్లు రాని అభ్యర్థుల బాగోగులు మేం చూసుకుంటాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవకాశం కల్పిస్తాం. మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేశాం. నిలబెట్టిన అభ్యర్థి గెలవాలనేదే కూటమి లక్ష్యం’’

‘‘ఎన్డీయే కేంద్రంలో 400కుపైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుంది. రాష్ట్రంలో కూటమికి 160కిపైగా అసెంబ్లీ సీట్లు వస్తాయి. కడప ఎంపీ సీటును మనమే గెలవబోతున్నాం. ఆ పార్టీ అభ్యర్థి.. ఈ పార్టీ అభ్యర్థి అని చూడొద్దు. అందరూ ఎన్డీయే అభ్యర్థులుగానే భావించాలి. మూడు పార్టీలు వేసే పునాది.. 30 ఏళ్ల భవిష్యత్తుకు నాంది పలకాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

‘‘ఐదేళ్లలో జగన్‌ ఇంత ఘోరంగా రాజకీయాలు చేస్తారనుకోలేదు. ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధించడం మొదలుపెట్టారు. అబద్ధాలు చెప్పి మరోసారి గెలవాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారు. విశాఖలో కంటెయినర్‌ దొరికితే తెదేపాపై విమర్శలు చేస్తారా? బ్రెజిల్‌ అధ్యక్షుడు ఎన్నిక కాగానే విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. డ్రగ్స్‌ మాఫియాను పెంచి పొషించిందెవరో అందరికీ తెలుసు. చేసేది, చేయించేది వైకాపా’’ అని చంద్రబాబు మండిపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని