ChandraBabu: గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు: చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు తెదేపా(TDP) అవసరం ఎంతో ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(ChandraBabu) అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు.

Updated : 09 Dec 2023 13:18 IST

ఒంగోలు: రాష్ట్ర ప్రజలకు తెదేపా(TDP) అవసరం ఎంతో ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(ChandraBabu) అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా మాట్లాడారు. ‘‘గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఇస్తాను. అంతర్గతంగా చేయించే సర్వేల్లో నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదు. ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతా తప్ప పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఓట్ల అవకతవకల విషయాన్ని ఇన్‌ఛార్జ్‌లు బాధ్యతగా తీసుకోవాలి. అన్నీ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందనే అలసత్వం వద్దు’’ అని పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరించారు.

అనంతరం గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు కొట్టుకుపోయిన అంశాన్ని తెదేపా నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గేటు కొట్టుకుపోయిందని నేతలు ఆరోపించారు. ఉదయమే సంఘటనాస్థలానికి వెళ్లి.. వారు చేసిన క్షేత్రస్థాయి పరిశీలనను చంద్రబాబుకు నేతలు వివరించారు.

ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకూ నిధులు ఇవ్వట్లేదు: నారా లోకేశ్‌

కలిసి పనిచేద్దాం.. జగన్‌ను ఇంటికి సాగనంపుదాం

ప్రతి కార్యక్రమంలో తెలుగుదేశం - జనసేన నేతలు కలిసి వేదికను పంచుకోవాలని జనసైనికులకు చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయిలోనూ కలిసి పనిచేస్తూ జగన్‌ను ఇంటికి సాగనంపుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై గ్రామస్థాయిలోనూ కలసి పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలుగుదేశం - జనసేన నిర్వహించే కార్యక్రమాల్లో నేతలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చంద్రబాబు వారితో అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని