Congress: తప్పుడు హామీల పత్రం.. భాజపా మేనిఫెస్టోపై కాంగ్రెస్‌ విమర్శలు

Congress: భాజపా ఆదివారం విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్‌ పార్టీ విరుచుకుపడింది.

Published : 14 Apr 2024 14:43 IST

దిల్లీ: భాజపా లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను (BJP Manifesto) తప్పుడు హామీల పత్రంగా కాంగ్రెస్‌ పార్టీ కొట్టిపారేసింది. గతంలో ఇచ్చిన హామీలనే ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆరోపించింది. తాజాగా ‘సంకల్ప పత్ర’లో పేర్కొన్న గ్యారెంటీలన్నీ మోదీ తప్పుడు హామీలకు వారెంటీలని కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు.

ఉద్యోగ కల్పన, రైతుల ఆదాయ రెట్టింపు, ధరల పెరుగుదల కట్టడి వంటి హామీలను మోదీ నెరవేర్చలేదని ఖర్గే తెలిపారు. పైగా వీటన్నింటినీ 2047కు వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్ల పాలనలో యువత, రైతులు సహా దేశ ప్రజల ప్రయోజనాల కోసం మోదీ (PM Modi) ఏమీ చేయలేదని విమర్శించారు. యువత ఉపాధి అవకాశాల కోసం ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. వీటి పరిష్కారంపై భాజపా మేనిఫెస్టోలో (BJP Manifesto) ఒక్క హామీ లేదని ఆరోపించారు.

భాజపా మేనిఫెస్టో విడుదల.. కీలకాంశాలివే..

2014 మేనిఫెస్టోలో నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని మోదీ హామీ ఇచ్చారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా అన్నారు. కానీ, చివరకు ఎన్నికల బాండ్లను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఈశాన్య భారత్‌లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని భాజపా హామీ ఇచ్చిందని.. కానీ, అక్కడ ప్రస్తుతం హింస చెలరేగుతోందన్నారు. 100 జిల్లాల్లో పేదరికాన్ని పూర్తిగా తొలగిస్తామన్న గత హామీని పూర్తిగా విస్మరించారన్నారు. ‘ప్రపంచ ఆకలి సూచీ’లో భారత్‌ స్థానమే అందుకు నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో భాజపా తప్పుడు హామీలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.

ఎలాంటి సంప్రదింపులు లేకుండా కేవలం 13 రోజుల్లోనే భాజపా మేనిఫెస్టోను రూపొందించిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందనే వాదనలో వాస్తవం లేదన్నారు. భాజపా తప్పుడు హామీలతో ప్రజలు విసిగి పోయారని.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని