Shinde - Ajit Pawar: శిందేకు పొగ?.. త్వరలో ముఖ్యమంత్రిగా అజిత్!
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సీఎం ఏక్నాథ్ శిందే సహా ఆయన వర్గానికి చెందిన మొత్తం 16 మంది శాసన సభ్యులపై అనర్హత వేటు వేసి ఎన్సీపీ నేత అజిత్ పవార్కు మహారాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
శిందే ఎమ్మెల్యేలపై వేటు?
మహారాష్ట్రలో ఊహాగానాలతో కలకలం
సామ్నాలోనూ సంపాదకీయం
ఖండించిన భాజపా
గాలివార్తలని కొట్టిపారేసిన పార్టీ
ముంబయి: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సీఎం ఏక్నాథ్ శిందే సహా ఆయన వర్గానికి చెందిన మొత్తం 16 మంది శాసన సభ్యులపై అనర్హత వేటు వేసి ఎన్సీపీ నేత అజిత్ పవార్కు మహారాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన నాటకీయ పరిణామాల వెనుక భాజపా అసలు వ్యూహం ఇదేనా అనే అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరాఠా నేత అయిన శిందేను శివసేన నుంచి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేసిన భాజపా ఇప్పుడు అంతకంటే బలమైన మరాఠా నేతకు పగ్గాలు అప్పగించి లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని తలపోస్తోందని అంటున్నారు. మరోవైపు 16 మంది శిందే వర్గ ఎమ్మెల్యేలపై స్పీకరు ఆగస్టు 11 లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శిందేను తప్పించి అజిత్కు పగ్గాలు అప్పగించాలని భాజపా భావిస్తోందని అంటున్నారు.
ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడంతో తలెత్తిన పరిణామాలపై శివసేన (ఉద్ధవ్) పత్రిక సామ్నా ప్రచురించిన సంపాదకీయమూ కలకలం రేపింది. త్వరలోనే ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే స్థానాన్ని అజిత్ పవార్ భర్తీ చేస్తారని సామ్నా పేర్కొంది. ‘ఏడాది కిందట శివసేనను చీల్చి బయటకు వచ్చిన వారిలో 16 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల నేతృత్వంలోని భాజపా మహారాష్ట్రలోనే కాదు.. దేశంలోని రాజకీయాలనే బురదమయం చేసింది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేను అజిత్ పవార్ భర్తీ చేస్తారు. ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పవార్ ఈ కూటమితో కలిశారనుకోవడం లేదు. శిందే, ఆయన మద్దతుదారులపై త్వరలో అనర్హత వేటు పడుతుంది. పవార్కు పట్టాభిషేకం చేస్తారు. రాష్ట్రంలో ఇదివరకు ఇలాంటి సంప్రదాయం లేదు’ అని సామ్నా ఆగ్రహం వ్యక్తం చేసింది. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంలో రికార్డు సృష్టించారని వ్యాఖ్యానించింది. గతంలోని కాంగ్రెస్, బ్రిటిష్ హయాంలే మేలని, వారు ధైర్యంగా వీధుల్లోకి వచ్చి పోరాడేవారని, ఇలా దొంగ దెబ్బ తీసేవారు కాదని ఘాటుగా విమర్శించింది.
అయితే.. ఈ వాదనల్ని భాజపా తోసిపుచ్చింది. అనర్హత వేటు విషయంలో అసలు తమకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడదని, ఒకవేళ వచ్చినా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, భాజపా నేత మాధవ్ భండారి స్పష్టం చేశారు.
ఇదీ విశ్లేషకుల వాదన
‘భాజపా మహారాష్ట్రలోని 48 లోక్సభ సీట్లలో 45 వరకూ గెలవాలని కోరుకుంటోంది. అది శిందేవల్ల సాధ్యం కాదనేది ఆ పార్టీ భావన. శిందేను తీసుకొచ్చినప్పుడు భాజపా మరాఠా కార్డును వాడింది. ఇప్పుడు ఆ పార్టీకి మరో బలమైన మరాఠా నేత అజిత్ పవార్ రూపంలో దొరికారు. శిందే కంటే అజిత్ బాగా ఎన్నికల్లో ప్రభావం చూపగలరని భాజపా నమ్ముతోంది’ అని ఓ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.
శిందే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డా భయం లేదు!
సుప్రీంకోర్టు సూచనల మేరకు ఆగస్టు 11లోగా సీఎం శిందేసహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడ్డా భాజపా కూటమికి వచ్చే నష్టం ఏమీ లేదని మహారాష్ట్ర విధాన సభ మాజీ అధికారి అనంత్ కల్సే వెల్లడించారు. రాజ్భవన్కు సమర్పించిన లేఖ ప్రకారం.. అజిత్ పవార్కు 40 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, భాజపాకు ఇప్పటికే 105 మంది సభ్యులున్నారని, మెజారిటీకి అవసరమైన 145 మంది మద్దతు సులభమేనని ఆయన అంటున్నారు. అప్పుడు శిందే వర్గ ఎమ్మెల్యేల మద్దతూ అవసరం లేదనేది ఆయన వాదనగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.