అమరావతి భాజపా అభ్యర్థిగా నవనీత్‌ రాణా

మహారాష్ట్రలోని అమరావతి నుంచి ప్రస్తుతం స్వతంత్ర ఎంపీగా ఉన్న సినీ నటి నవనీత్‌ రాణాకు భాజపా లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో తొలి నుంచి పోరాడుతున్న ఆమెను భాజపా తమ పార్టీలో చేర్చుకుని సీటు కేటాయించింది.

Published : 28 Mar 2024 04:06 IST

చిత్రదుర్గలో కేంద్ర మంత్రి నారాయణస్వామికి మొండిచేయి

ఈనాడు, దిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి నుంచి ప్రస్తుతం స్వతంత్ర ఎంపీగా ఉన్న సినీ నటి నవనీత్‌ రాణాకు భాజపా లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో తొలి నుంచి పోరాడుతున్న ఆమెను భాజపా తమ పార్టీలో చేర్చుకుని సీటు కేటాయించింది. దీంతో భాజపా అభ్యర్థుల జాబితాలో ఉన్న హేమమాలిని, కంగనా రనౌత్‌, అరుణ్‌ గోవిల్‌లతో మరో నటి చేరినట్లయింది. కర్ణాటకలోని చిత్రదుర్గ ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి ప్రస్తుత కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ సహాయ మంత్రి ఎ.నారాయణస్వామిని తప్పించి కొత్తగా గోవింద్‌ కార్జోల్‌కు అవకాశం ఇచ్చింది. ఈయన ఇదివరకు కర్ణాటక మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, నీటి పారుదలశాఖ, ప్రజాపనులు, సామాజిక న్యాయం సాధికారశాఖ మంత్రిగా పని చేశారు. 73 ఏళ్ల గోవింద్‌ కర్జోల్‌ ఆ రాష్ట్రంలోని ముధోల్‌ నియోజకవర్గం నుంచి 5సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడిగానూ పని చేశారు. నారాయణస్వామికి టికెట్‌ నిరాకరించడంతో ఇప్పటివరకూ టికెట్లు కోల్పోయిన కేంద్ర మంత్రుల సంఖ్య 8కి చేరింది. ఇదివరకు ఈ జాబితాలో దిల్లీ నుంచి మీనాక్షి లేఖి, గుజరాత్‌ నుంచి దర్శనా జర్దోస్‌, త్రిపుర నుంచి ప్రతిభా భౌమిక్‌, బిహార్‌ నుంచి అశ్వినీ కుమార్‌ చౌబే, ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి జనరల్‌ వీకే సింగ్‌, ఒడిశా నుంచి బిశ్వేశ్వర్‌ టుడు, మణిపుర్‌ నుంచి రాజ్‌కుమార్‌ రంజన్‌సింగ్‌ ఉన్నారు. ఇప్పటివరకూ విడుదల చేసిన 7 జాబితాల ద్వారా భాజపా 407 మంది అభ్యర్థులను ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని