Pemmasani Chandra Sekhar: బుర్రిపాలెం డాక్టర్‌ గారు... కేంద్ర మంత్రి అయ్యారు!

గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి అమెరికా వెళ్లి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. 

Published : 10 Jun 2024 00:01 IST

గుంటూరు (పట్టాభిపురం): అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే పెమ్మసాని చంద్రశేఖర్‌ 2014లోనే ఎంపీగా పోటీ చేసేవారు. వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పోటీ చేయలేదు. అయితే ఇప్పుడు బరిలోకి దిగి 3,44,695 ఓట్ల మెజారిటీతో గుంటూరు ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి కూడా అయ్యారు. 

చంద్రశేఖర్‌ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత వాసులకు చిరపరిచితులు. చంద్రశేఖర్‌ (Pemmasani Chandra Sekhar) ఎంసెట్‌లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించారు. 

పీజీ చదివేందుకు అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామ్‌ పూర్తి చేయడంలో వసతి, శిక్షణకు అధిక వ్యయభారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో జనరల్‌ గైసింగర్‌ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 

అమెరికాలో లైసెన్సింగ్‌ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను స్థాపించారు. స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తూ అతికొద్దికాలంలోనే రూ.వేల కోట్లకు ఎదిగింది. అమెరికాలోని డాలస్‌లో పెమ్మసాని ఫౌండేషన్‌ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. 

తొలి నుంచి తెదేపాతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్‌ ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు. ఇప్పుడు గుంటూరు నుంచి తెదేపా ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయన్ను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. 

జన్మస్థలం: బుర్రిపాలెం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా
వయసు: 47
విద్యార్హత: ఎంబీబీఎస్, ఎండీ (ఇంటర్నల్‌ మెడిసిన్‌)
తల్లిదండ్రులు: సువర్చల, పెమ్మసాని సాంబశివరావు
భార్య: డాక్టర్‌ శ్రీరత్న
కుమారుడు: అభినవ్‌; కుమార్తె: సహస్ర
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని